ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మండలానికి ఇద్దరు ఎంఈవోల నియామక పక్రియలో ముందుకెళ్లొద్దన్న హైకోర్టు

మండలానికి ఇద్దరు ఎంఈవోల నియామకం విషయంలో అక్టోబరు 20 వరకు ముందుకెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఆ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణను అక్టోబర్‌ 20కి వాయిదా వేసింది.

By

Published : Oct 1, 2022, 11:13 AM IST

Etv Bharat
Etv Bharat

ప్రెసిడెన్షియల్‌ ఉత్తర్వులకు విరుద్ధంగా మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమించేలా ప్రభుత్వం సెప్టెంబర్‌ 16న జీవో 154 తీసుకొచ్చిందంటూ, జడ్పీహెచ్‌ పాఠశాలల్లో హెడ్‌మాస్టార్లుగా పనిచేస్తున్న డీ ఆర్ డీ కుమార్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వారి తరఫున ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎంఈవోల పోస్టుల సృష్టికి ప్రెసిడెన్షియల్‌ ఉత్తర్వులు ఉండాలన్నారు. అలాంటి ఉత్తర్వులు ఏమి లేకుండా ప్రభుత్వం పోస్టులను సృష్టించిందన్నారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన జీవో చట్ట విరుద్ధమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 250 మంది హెడ్‌మాస్టార్లను ప్రభుత్వం ఇటీవల పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఎంఈవోలుగా నియమించిందన్నారు. కొత్త పోస్టులు సృష్టిస్తున్నామని సాకుగా చూపిస్తూ జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో హెడ్‌మాస్టార్లను ఉద్దేశపూర్వకంగా విస్మరించి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను పూర్తిస్థాయి ఎంఈవోలుగా నియమించే యత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇదే జరిగితే పిటిషనర్లకు ఎంఈవోలుగా అవకాశం లేకుండా పోతోందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించకుండా ఉద్యోగుల సర్వీసులను మార్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎంఈవోల పోస్టుల సృష్టికి ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ అవసరమా లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత అభ్యంతరకంగా అనవసరంగా కోర్టుపై వ్యాఖ్యలు చేసినట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాదులు ఇదే తరహాలో కోర్టులో వాదనలు వినిపించడం చాలా దురదృష్టకరంగా కోర్టు భావిస్తోందన్నారు. అయినప్పటికి కేసు లోతుల్లోకి వెళ్లి కేసు విచారణను ముగించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేస్తూ, పిటిషనర్లవి కేవలం ఊహాజనిత ఆందోళన మాత్రమేనంది. ఉపాధ్యాయుల పదోన్నతిలో ఎప్పటి నుంచో ఉన్న ప్రతిష్టంభనను తొలగించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపింది. పోస్టుల సృష్టికి రాష్ట్రపతి అనుమతి ఉందా లేదా అనే అంశంపై ప్రభుత్వ న్యాయవాది సరైన సమాధానం ఇవ్వలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. జీవో 154 ఆధారంగా అక్టోబర్‌ 20 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details