ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫోన్ ట్యాపింగ్​ వ్యవహారంపై విచారణ వారం రోజులకు వాయిదా

By

Published : Aug 21, 2020, 5:00 AM IST

హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్​ను ఓ ఐపీఎస్ అధికారి పర్యవేక్షించారని, ఆ అధికారి వివరాలని పేర్కొంటూ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్​లోని అంశాల్ని ప్రధాన ఆఫిడవిట్​లో ప్రస్తావిస్తూ సవరణ దస్త్రం దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరీ, జస్టిస్ డి.రమేశ్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

high court on phone tapping
high court on phone tapping

ఏపీ హైకోర్టుకు చెందిన కొంతమంది న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని.. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ...విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది ఎ.నిమ్మీగ్రెస్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం ధర్మాసనం విచారణ చేసింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ .. ఐపీఎస్ అధికారి పేరు, ఇతర వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేశామని కోర్టుకు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ .. తాజాగా దాఖలు చేసిన అదనపు అఫిడవిట్​లోని వివరాలను.. ప్రధాన అఫిడవిట్ అభ్యర్థనల్లో(ప్లీడింగ్స్) చేరుస్తూ.. సవరించిన దస్త్రం వేయాలని సూచించింది. ప్రతివాదులకు నోటీసు ఇస్తే ప్రధాన అఫిడవిట్​లోని అంశాలకు సమాధానం ఇస్తారని.. అదనపు అఫిడవిట్​కు కాదని తెలిపింది. అభ్యర్థనలను సవరించకపోతే .. అదనపు అఫిడవిట్​ను పరిగణనలోకి తీసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయవాది స్పందిస్తూ .. ఆదేశిస్తే ప్రధాన అఫిడవిట్​లో అభ్యర్థనలను సవరిస్తూ, అఫిడవిట్ వేస్తానన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తాము ఆదేశాలివ్వలేమని.. అలాంటి ఆదేశాలిస్తే మరోరోజు మరొకటి చెబుతారని వ్యాఖ్యానించింది.

న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ .. ట్యాపింగ్ పై సీబీఐ ద్వారా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఆ తరహా ఆదేశాలు ఇవ్వడానికి ఆధారాలేమిటో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రధాన అఫిడవిట్​లో పూర్తి అభ్యర్థన ప్రస్తావించనంతవరకు దర్యాప్తునకు ఆదేశం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: 'ప్రభుత్వం ఇచ్చే డబ్బు.. మహిళల జీవితాన్ని మార్చేందుకే'

ABOUT THE AUTHOR

...view details