సినిమా టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని.. లైసెన్సింగ్ అథార్టీ (జేసీ)కి అభిప్రాయమే తెలియజేయగలదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. అంతిమంగా ధరలను నిర్ణయించేది లైసెన్సింగ్ అథార్టీయేనని స్పష్టం చేసింది. గత జీవోల ప్రకారం లైసెన్సింగ్ అథార్టీ టికెట్ ధరలను నిర్ణయిస్తుందని గుర్తుచేసింది. ఈ వ్యవహారం మొత్తాన్ని లోతుగా చూడాల్సి ఉందని అభిప్రాయపడింది. ఆన్లైన్లో సినిమా టికెట్లు విక్రయించేటప్పుడు సర్వీసు ఛార్జీలను టికెట్ ధరల్లో కలపడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పాత విధానంలో టికెట్లను విక్రయించుకోవచ్చని మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు తెలిపింది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రేక్షకులకు సర్వీసు ఛార్జీలు విధించుకునే వెసులుబాటును యాజమాన్యాలకు కల్పించింది.
ఆన్లైన్ టికెట్ విక్రయాలపై సందేహాలు, నిధుల దుర్వినియోగం, మళ్లింపు వంటివి జరుగుతాయని ఆందోళన అక్కర్లేదని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూన్ 15కు వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్ ధరల్లోనే సర్వీసు ఛార్జీలను చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న జీవో ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ తరఫున ఫరీద్ బిన్ అవధ్ హైకోర్టును ఆశ్రయించారు.