గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ ల అధికారాలను కొన్నింటిని వీఆర్వోలకు అప్పగించటంపై దాఖలైన పిటిషన్ లపై విచారణ జరిపిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబర్ -2ను తప్పుపట్టింది. గ్రామ పంచాయతీల పరిపాలన, విధుల్ని ప్రభుత్వం ఆక్రమించిందని చెప్పడంలో సందేహం లేదని తేల్చిచెప్పింది. గ్రామ పంచాయతీలకు సమాంతరంగా గ్రామాల్లో అధికార కేంద్రాల్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిందని పిటిషనర్ చేసిన వాదనల్లో వాస్తవం ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా.. రాష్ట్రానికి సీఎం ఎంతో.. గ్రామానికి సర్పంచ్ అంతే అని ధర్మాసనం అభిప్రాయపడింది.
సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శులకున్న కొన్ని అధికారాలను గ్రామ రెవెన్యూ అధికారులకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో -2 ను తక్షణం సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శుల అధికారాలను లాగేసుకునేలా ప్రభుత్వం జీవో ఉందని అభిప్రాయం వ్యక్తంచేసింది. గ్రామ సచివాలయాల్లో పరిపాలన సహాయకులపై సర్పంచ్ , కార్యదర్శికి నియంత్రణ లేకుండా జీవో చేస్తోందని స్పష్టం చేసింది. సర్పంచ్ కు నియంత్రణ అధికారం లేకుండా చేయడం 73 వ రాజ్యాగం సవరణ ఉద్దేశానికి విఘాతం కలిగించడమేనని పేర్కొంది.