ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని సంబంధిత పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

రాజధాని వ్యవహారంలో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని హైకోర్టులో న్యాయవాదులు వాదించారు. పబ్లిక్‌ సర్వెంట్లు ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని ప్రాంతం నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపును నిలువరించాలని విజ్ఞప్తి చేశారు.

By

Published : Feb 12, 2020, 7:59 AM IST

high court adjourned to today on capital issue
రాజధాని వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా

రాజధాని సంబంధిత పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

కర్నూలుకు కార్యాలయాలు తరలించే జీవోతో పాటు విశాఖలోని మిలీనియం టవర్ బి నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరు చేస్తూ ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఎమ్​. రమేశ్ హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు. రాజధాని నగర నిర్మాణ పనులను అమరావతిలో కొనసాగించాలని కోరారు. రాజధాని వ్యవహారంలో పలువురు ఐఏఎస్​ అధికారులు సర్వీసు నిబంధనలను అనుసరించడంలేదని పిటిషనర్​ తరపు న్యాయవాది మురళీధరరావు వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. సీఎం ప్రధాన సలహాదారు అజేయకల్లం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నారావారిపల్లెలో నిర్వహించిన సభలో పాల్గొని రాజకీయ ఉపన్యాసాలు చేశారన్నారు. పబ్లిక్ సర్వెంట్లుగా ఉంటూ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడారని ధర్మాసనానికి విన్నవించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యాలయాల తరలింపులో భాగంగా విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణ పనులకు నిధులు కేటాయించినట్లు కోర్టుకు తెలిపారు. ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారని... ఐఏఎస్ అధికారులు మిలీనియం టవర్‌ను పరిశీలించారని తెలిపారు. మంగళగిరిలో అన్ని వసతులతో సీఐడీ కార్యాలయం ఉండగా... విశాఖలో మళ్లీ కార్యాలయం ఏర్పాటుకు అన్వేషిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అమరావతిలో రైతులు నిరసన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం పరోక్షంగా తన ఉద్దేశాన్ని నెరవేర్చుకునేలా చర్యలు చేపడుతోందన్నారు. ఈ ప్రక్రియను నిలువరించాలని జీఎన్​ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలను సీల్డ్ కవర్​లో కోర్టుకు తెప్పించి పరిశీలించాలని కోరారు. రమేశ్‌ తరపున న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయాలని ఏజీకి సూచించింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదుల జాబితాలో ఉన్న సీఎం, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేస్తామని మౌఖికంగా తెలిపింది.

ఏజీ వాదనలు వినిపిస్తూ.. మిలీనియం టవర్ నిర్మాణ పనులు 2016 నుంచి కొనసాగుతున్నాయన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగానే నిధులు కేటాయించామన్నారు. అభివృద్ధి పనులకు వ్యతిరేకం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి అనుబంధ పిటిషనర్ల తరపున న్యాయవాదుల వాదనలను కోర్టు ఆలకించింది. ఏ కారణాలతో కర్నూలుకు కార్యాలయాలు తరలిస్తున్నారంటూ ధర్మాసనం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. విజిలెన్స్ కమిషన్ కార్యాలయానికి సచివాలయంతో సంబంధం లేదన్నారు. ఏపీపీఎస్సీ తరహాలో విజిలెన్స్ కమిషన్ స్వతంత్రమైందన్నారు. ప్రభుత్వ శాఖలపై కమిషన్ పర్యవేక్షిస్తుంది తప్ప ప్రభుత్వంలో భాగం కాదన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో తగినంత స్థలం లేని కారణంగా కర్నూలుకు తరలిస్తున్నామన్నారు. వివరాలతో పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు తగిన సమయం లేకపోవడం వల్ల ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి :

బార్ల లైసెన్సుల ఉపసంహరణ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

ABOUT THE AUTHOR

...view details