ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 22, 2022, 4:43 PM IST

ETV Bharat / city

'శేఖర్' చిత్ర ప్రదర్శనలు నిలిపివేత.. రాజశేఖర్​ భావోద్వేగం.. అసలేమైంది..?

Sekhar Movie: రాజశేఖర్​ నటించిన 'శేఖర్​' సినిమాను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. తనకు జీవిత-రాజశేఖర్​ డబ్బు ఇవ్వాలని ఓ ఫైనాన్షియర్​ కోర్టును ఆశ్రయించడంతో.. అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అతనికి చెల్లించాల్సిన డబ్బును సకాలంలో చెల్లించకపోవడంతో చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని సిటీ సివిల్​ కోర్టు ఆదేశించింది.

sekhar
sekhar

జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన "శేఖర్" చిత్ర ప్రదర్శనలు నిలిచిపోయాయి. ఈ నెల 20న విడుదలైన ఈ సినిమా.. సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఆడుతోన్న అన్ని థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేశారు. ఈ చిత్రానికి సంబంధించి జీవిత రాజశేఖర్.. రూ.65 లక్షలు చెల్లించాలంటూ ప్రముఖ ఫైనాన్షియర్ పరందామరెడ్డి కోర్టును ఆశ్రయించారు. 48 గంటల్లో ఆ డబ్బును డిపాజిట్ చేయాలని.. లేనిపక్షంలో చిత్ర ప్రదర్శనలు నిలిపివేయాల్సి వస్తుందని కోర్టు పరందామరెడ్డికి అనుకూలంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో.. కోర్టు ఆదేశించిన సమయానికి డబ్బు డిపాజిట్ చేయని కారణంగా శేఖర్ చిత్ర ప్రదర్శనలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

రాజశేఖర్​ భావోద్వేగం..: తన సినిమా ప్రదర్శనలు నిలిచిపోవడంపై నటుడు రాజశేఖర్ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. తాను, తన కుటుంబం శేఖర్ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డామని పేర్కొన్నారు. కొందరు కావాలనే కుట్ర పన్ని సినిమా ప్రదర్శనలను అడ్డుకున్నారని ఆరోపించారు. సినిమా అంటే తమకు ప్రాణమని, ప్రత్యేకంగా శేఖర్ చిత్రంపై తన కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎంతో కష్టపడి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని.. మంచి స్పందన కూడా వస్తోందని రాజశేఖర్ తెలిపారు. ఇలాంటి సమయంలో సినిమా ప్రదర్శనలను నిలిపివేయడం పట్ల రాజశేఖర్ ఉద్వేగానికి లోనయ్యారు.

అసలేమైందంటే..: జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో మే 20న విడుదలైన శేఖర్ చిత్రాన్ని ఆర్థికవివాదాలు వెంటాడుతున్నాయి. ఆ చిత్ర నిర్మాత జీవితకు తాను అప్పు ఇచ్చానని పరందామరెడ్డి అనే ఫైనాన్షియర్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా.. శేఖర్ చిత్రానికి తానే నిర్మాతనని మరో ఫైనాన్షియర్ బీరం సుధాకర్ రెడ్డి ప్రకటించారు. తన సినిమాకు నష్టంకలిగిస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కథానాయకుడు రాజశేఖర్, దర్శకురాలు జీవితకు ఇవ్వాల్సిన పారితోషకం చెల్లించానని.. శేఖర్ సినిమాపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని సుధాకర్ రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉండగా.. రెండు రోజుల కిందట పరందామరెడ్డి జీవిత నుంచి తనకు రావల్సిన 65 లక్షల రూపాయలను ఇప్పించాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పరందామరెడ్డి పిటిషన్​ను పరిశీలించిన కోర్టు.. 48 గంటల్లోగా ఆ డబ్బును చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా.. నిర్ణీత సమయంలో డబ్బు చెల్లించని పక్షంలో శేఖర్ సినిమా ప్రదర్శనలతో పాటు డిజిటల్ మాద్యమంలో ఎక్కడ కూడా ప్రసారాలు చేయకూడదనే ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై స్పందించిన శేఖర్ చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి... తమ చిత్రంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. తన చిత్రానికి నష్టం కలిగించే వ్యక్తులపై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details