WEATHER : కోస్తాంధ్ర తీరాన్ని అనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వెంబడి అల్పపీడనం బలపడనున్నట్లు.. ఎల్లుండి వరకు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
పులిచింతల ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం: పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. కృష్ణా నదికి ఎగువున కురిసిన భారీ వర్షాలకు నాగార్జున సాగర్ నుంచి 3 లక్షల 31 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండడంతో పులిచింతల ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తి నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ దిగువన నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
సోమశిల జలాశయానికి పెరిగిన వరద: నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ఉద్ధృతి పెరుగుతోంది. అనంతసాగరం, చేజర్ల, కలువాయి, ఆత్మకూరు, సంగం మండలాల్లోని పెన్నా పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి 20 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. ప్రస్తుతం జలాశయంలో 72 టీఎంసీల నీటినిల్వ ఉంది.
శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ఉద్ధృతి : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను 12 అడుగులు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 3 లక్షల 18 వేల క్యూసెక్కులు సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 3.70 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 62 వేల 404 క్యూసెక్కులు సాగర్కు విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎగువ నుంచి లక్షా 4 వేల 126 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. డెల్టా కాలువలకు 15 వేల 376 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. 70 గేట్లను పైకెత్తి 88 వేల 750 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు వదులుతున్నారు. నాగార్జున సాగర్, పులిచింతల డ్యామ్ లనుంచి వచ్చే వరద ప్రవాహన్ని యథాతథంగా ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.