ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HYDERABAD RAINS: హైదరాబాద్​లో జోరువానలు.. నగరవాసులకు తప్పని తిప్పలు - అమరావతి వార్తలు

భాగ్యనగరాన్ని భారీ వర్షాలు వీడడం లేదు. అసలే అసంపూర్ణమైన డ్రైనేజీ వ్యవస్థ.. ఆపై భారీ వర్షాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రోడ్లపైన వరద నీరు పారుతోంది. కొన్ని చోట్ల మోకాలి లోతు వరకూ వరద నీరు చేరింది.

HYDERABAD RAINS
HYDERABAD RAINS

By

Published : Sep 6, 2021, 8:34 PM IST

హైదరాబాద్​లో జోరువానలు.. నగరవాసులకు తప్పని తిప్పలు

గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్​ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. జోరువానల ధాటికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద, మురుగు నీరు రహదారులపైకి చేరి.. వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని చోట్ల మోకాలిలోతు వరకూ వరద పోటెత్తింది.

వర్షాల కారణంగా ఎల్బీనగర్‌, మీర్‌పేట్‌ పరిధిలోని లోతట్టు కాలనీవాసులకు అవస్థలు తప్పడం లేదు. ఓవైపు నుంచి వరదనీరు.. మరో పక్క నుంచి మురుగు నీరు వీధుల్లోకి చేరడం వల్ల స్థానికులు అవస్థలు పడుతున్నారు. మీర్‌పేట్‌ పరిధిలోని సాయినగర్, శివసాయినగర్, శ్రీధర్‌నగర్ కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. ఎల్బీనగర్ పరిధిలోని గాంధీనగర్, విజయపురి కాలనీ, అయ్యప్ప నగర్, వెంకటేశ్వరకాలనీ, అంబేడ్కర్‌నగర్‌, భగత్‌సింగ్‌ కాలనీల్లోని రోడ్లపై ఇంకా వరద నీరు నిలిచి ఉంది.

ఉప్పల్‌, మేడిపల్లి, రామంతాపూర్‌తో పాటు... ఘట్‌కేసర్‌, బోడుప్పల్‌, పిర్జాదీగూడ, పోచారం ప్రాంతాల్లోని కాలనీవాసుల బాధలు వర్ణనాతీతం. ఇక్కడ ఏర్పడిన కొత్త కాలనీల్లోకి మురికి నీరు వచ్చి చేరుతోంది. సరైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో.. నీరు అలాగే నిల్వ ఉంటుంది. సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై నిలిచి ఉండడం వల్ల గుంతలు ఏర్పడి రోడ్లు దెబ్బతిన్నాయి. బేగంపేటలోని రసూల్‌పుర, బోయిన్‌పల్లి, చిలకలగూడ, వారసిగూడ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.

హైదరాబాద్​ జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు నిండుతుండడంతో సమీపంలోని ఉమామహేశ్వరకాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గత అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు చెరువు ఎగువన ఉన్న ఈ కాలనీవాసులు... రెండు నెలలపాటు ఇళ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో రెండు వీధుల్లోకి నడుములోతున నీరు వచ్చిచేరింది. ఫలితంగా స్థానికులు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు.

జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌సాగర్‌, సైఫ్‌ కాలనీ ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. మెట్రో సిటీ, గ్రీన్ సిటీ, నబీల్‌కాలనీ ప్రాంతాల్లో వరద ఇప్పటికే రోడ్లపై ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకి రాలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడ బర్హాన్‌ఖాన్ చెరువు నిండిపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. పటాన్‌చెరు అంబేడ్కర్ కూడలిలో పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. వర్షం కురవడంతో గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాల కారణంగా మేడ్చల్ జిల్లా కాప్రా చెరువు పూర్తిగా నిండిపోయింది. నాలాలు పొంగి పొర్లుతూ ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. నాగారం ప్రధాన రహదారిపై గత వారం రోజుల నుంచి మోకాలి లోతు నీళ్లు పోవడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కాప్రా శివసాయినగర్​లో గత నాలుగురోజుల నుంచి కాలనీలోకి నీళ్లు వస్తుండడం వల్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది. ప్రత్యేక సిబ్బందిని నియమించి.. పలుచోట్ల రోడ్లపై నిలిచిన నీటిని తొలిగిస్తోంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో... లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది.

ఇదీచూడండి:

Hyderabad rain: అలర్ట్​ హైదరాబాద్‌... 6- 8 గంటల పాటు ఇళ్లల్లోనే ఉండండి

ABOUT THE AUTHOR

...view details