Supreme Court: గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ 12 ఏళ్లుగా జాప్యం కావడాన్ని సహించలేమని వ్యాఖ్యానించింది. తాము గతంలో ఆదేశించినా విచారణలో జాప్యం ఎందుకు జరిగింది? విచారణ ఏ దశలో ఉందో చెప్పాలంది. ఏ కారణాల చేత విచారణ ముందుకు సాగడం లేదో సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని హైదరాబాద్లోని సీబీఐ కేసుల కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిని బుధవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి ధర్మాసనం వాయిదా వేసింది. గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్రెడ్డితోపాటు మరో 9 మందిపై సీబీఐ 2009లో కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబరు 5న జనార్దన్రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్లోని కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లవద్దనే షరతులతో సుప్రీంకోర్టు 2015 జనవరి 20న ఆయనకు బెయిలు మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నందున బెయిలు షరతులను సడలించాలంటూ జనార్దన్రెడ్డి 2020లో మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా ఆయా జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల్లకు తెలియజేసి బళ్లారి, కడప, అనంతపురం వెళ్లవచ్చంటూ గతేడాది ఆగస్టు 19న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంలో సీబీఐ అఫిడవిట్ వేసింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ను జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
Supreme Court: గాలి జనార్దన్రెడ్డి గనుల కేసు.. విచారణలో పురోగతి లేదా?: సుప్రీంకోర్టు - mining case
Supreme Court on Gali Janardhan Reddy Case: గనుల అక్రమ తవ్వకాల వ్యవహారంలో గాలి జనార్దన్రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేసు నమోదై 12ఏళ్లయినా జడ్జి ఎదుట విచారణ సాగకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తీవ్ర అభియోగాలున్న కేసులో విచారణ సాగకపోవడం సరికాదని పేర్కొంది. ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టులో కేసుల విచారణ ఏ దశలో ఉందో తెలపాలని ఆదేశించింది. విచారణ ఆలస్యంపై ఈనెల 19వ తేదీలోపు సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీబీఐ కేసుల కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది.

ఆయన బళ్లారిలో ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పు
సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) మాధవి దివాన్ వాదనలు వినిపిస్తూ.. గాలి జనార్దన్రెడ్డి స్వస్థలం బళ్లారి అని, ఆయన అక్కడ ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని, వారి ప్రాణాలకు ముప్పు ఉందని ధర్మాసనానికి విన్నవించారు. స్పందించిన జస్టిస్ ఎం.ఆర్.షా సీబీఐ కేసు విచారణ ఏ దశలో ఉందని ప్రశ్నించారు. విచారణ సాగడం లేదని మాధవి దివాన్ బదులిచ్చారు. విచారణపై స్టే ఉందా.. అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గతంలో అయితే లేదని ఏఎస్జీ సమాధానమిచ్చారు. గతంలో విషయం తాను అడగటం లేదని, ప్రస్తుతం ఉందా.. అని జస్టిస్ షా ప్రశ్నించారు. ఏఎస్జీ వద్ద సరైన సమాధానం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తీవ్రమైన అభియోగాలున్న ఈ వ్యవహారంలో కేసు నమోదైన 12 ఏళ్ల తర్వాతా హైదరాబాద్ సీబీఐ కేసుల న్యాయస్థానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట విచారణ సాగకపోవడం దురదృష్టకరం. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే. సుప్రీంకోర్టు 2021 ఆగస్టు 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో విచారణ వేగవంతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. అయినా ఎటువంటి పురోగతి లేదు. ప్రస్తుతం ట్రయల్ కోర్టులో విచారణ ఏ దశలో ఉంది.. విచారణ సాగకపోవడానికి కారణాలేమిటో తెలియజేస్తూ హైదరాబాద్ సీబీఐ కేసుల కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి సీల్డ్ కవర్ నివేదిక అందజేయాలి. ఆ నివేదిక ఈ నెల 19లోగా సుప్రీంకోర్టుకు చేరాలి. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్కు పిటిషనరు రిజాయిండర్ దాఖలు చేయొచ్చు’ అని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: