ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 18, 2020, 4:40 AM IST

ETV Bharat / city

ప్రజాప్రతినిధులు అధికారానికి తాత్కాలిక ధర్మకర్తలే :హైకోర్టు

ప్రభుత్వానికి అపరిమితమైన పున:సమీక్ష అధికారం కల్పిస్తే.. ఎన్నికలు ముగిసిన ప్రతిసారీ దుర్వినియోగానికి దారితీస్తుందని.. హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజాప్రతినిధులు అధికారానికి తాత్కాలిక ధర్మకర్తలేనని.. తేల్చిచెప్పింది. రాష్ట్ర పురోభివృద్ధికి ప్రభుత్వ విధానాల్లో నిలకడ అవసరమన్న ధర్మాసనం.. గత ప్రభుత్వ నిర్ణయాల్ని సులువుగా రద్దు చూయకూడదన్న సుప్రీం తీర్పును గుర్తుచేసింది.

hc on rajadhani sit issue in ap
hc on rajadhani sit issue in ap

గత ప్రభుత్వంలోని ముఖ్య నిర్ణయాల్ని తిరగదోడేందుకు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం.. దాని ఆధారంగా ఏర్పాటు చేసిన సిట్‌ తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చిన హైకోర్టు.. అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తర్వుల ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వానికి అపరిమితమైన పున:సమీక్ష అధికారం కల్పిస్తే.. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు అయ్యాక దుర్వినియోగం అయ్యేందుకు దారి తీస్తుందని.. స్పష్టం చేసింది. పునఃసమీక్ష అధికారం ఏ ప్రభుత్వానికి స్వతఃసిద్ధంగా లేదని పేర్కొంది. గత ప్రభుత్వ.. స్థాయిలో తీసుకున్న నిర్ణయాల్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు.. అంత సులువుగా రద్దు చేయకూడదని.. అసంపూర్ణంగా మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వం పై ఉందని.. " స్టేట్ ఆఫ్ హరియాణ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది.

కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు.. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల్ని రాజకీయ కారణాలతో.. పునఃసమీక్షించడం లేదా విస్మరించడం చేయకూడదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టంచేసిందని.. హైకోర్టు గుర్తుచేసింది. రాజకీయ కారణాలతో, పక్షపాతంతోనో గత ప్రభుత్వ నిర్ణయాల్ని విస్మరించకూడదని.. సుప్రీం తీర్పుల ఆధారంగా అర్థమవుతోందని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రం పురోగాభివృద్ధికి.. ప్రభుత్వ విధానాల్లో నిలకడ అవసరమని తెలిపింది. తీవ్రమైన చట్ట ఉల్లంఘనలు, స్పష్టమైన మోసం జరిగిన సందర్భాల్లో తప్ప.. రాజకీయ కారణాలతో ఇష్టానుసారంగా విధానాల్ని మార్చడానికి వీల్లేదని స్పష్టంచేసింది. దేశంలో అమల్లో ఉన్న చట్టాల ఉద్దేశం ఇదేనని.. ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది.

ఆ విషయాన్ని విస్మరిస్తే .. పరిస్థితిని చక్కదిద్దేందుకు హైకోర్టు జోక్యం చేసుకుంటుందని.. తేల్చిచెప్పింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని నడుపుతారని,చట్ట ప్రకారం పరిపాలించేందుకుఇచ్చినఅధికారానికి వారు తాత్కాలిక ధర్మకర్తలని వ్యాఖ్యానించింది. పాలకులు వస్తుంటారు పోతుంటారని,..ప్రభుత్వం అనేది నిరంతరం సాగే ప్రక్రియ అని.. ఆల్ ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్స్ పుస్తకంలోని సందేశాన్నిధర్మాసనం ఉటంకించింది. ఈ భావనను.. పగ్గాలు చేపట్టిన వారు తరచూ మరచిపోతుంటారని చురకలు వేసింది. ప్రజాస్వామ్యంలో తాత్కాలిక ధర్మకర్తలు.. నిర్దిష్ట కాలం వరకే పరిపాలిస్తారన్నహైకోర్టు.. చట్టబద్ధపాలనకు ప్రతి ఒక్కరూ, మరీ ముఖ్యమంగా అధికారంలో ఉన్నవాళ్లు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.

గత ప్రభుత్వ నిర్ణయాల్ని సమీక్షించేందుకు గతేడాది జూన్ 26 న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ జారీచేసిన జీవోను పరిశీలిస్తే.. గతంలో నేరాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం ముందుగానే నిర్ణయానికి వచ్చినట్లుందని.. హైకోర్ట్‌ వ్యాఖ్యానించింది.' హద్దులేని అవినీతి ' భూ ఆక్రమణ తదితర పదాల్ని జీవోలో ప్రస్తావించారన్న ధర్మాసనం.. మంత్రివర్గ ఉపసంఘం రాజకీయ కారణాలతో ఏర్పాటు చేశారా అని.. ప్రశ్నించింది. సరైన విచారణ జరపకుండానే ప్రభుత్వం ఇలాంటి అభిప్రాయానికి రావచ్చా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆరోపిత నేరాల పై మంత్రివర్గ ఉపసంఘం , సిట్ ఏర్పాటు అవసరం లేకుండానే.. ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థతో దర్యాప్తు జరిపించొచ్చని అభిప్రాయపడింది.

ఇదీ చదవండి:వైకాపాకు జీఎస్టీ నిధులు రాబట్టే శ్రద్ధ లేదు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details