ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడికి మరణశిక్ష - six year old girl rape case news

ఆరేళ్ల బాలికపై మానవమృగం జరిపిన కిరాతక పాపం పండి చావుదెబ్బ తగిలింది. సభ్యసమాజం నివ్వెరపోయేలా అకృత్యానికి పాల్పడిన కర్కోటకుడికి ఉరే సరి అని న్యాయాలయం మరణ దండన ఖరారు చేసింది. ఘటన జరిగిన తరుణం నుంచి జ్వలిస్తున్న మనసుతో ఆ చిన్నారి కన్నతల్లిదండ్రులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. నిందితుడిని బహిరంగంగా మట్టుబెట్టాలంటూ.. ఎంతోమంది రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున నిరసన గళం విన్పించారు. సోమవారం నిందితుడికి మరణశిక్ష పడడంతో చిన్నారి కుటుంబసభ్యులతో సహా ప్రజాసంఘాలు, విద్యార్థిసంఘాల హర్షాతిరేకాలు మిన్నంటాయి.

hanging punishment to who  accused in chittoor  six year old girl rape case
hanging punishment to who accused in chittoor six year old girl rape case

By

Published : Feb 25, 2020, 7:36 AM IST

చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడికి మరణశిక్ష

క్షణక్షణం ఉత్కంఠ.. నిందితుడికి ఏ శిక్ష విధిస్తారో అని అందరిలోనూ ఒకటే చర్ఛ. అందరూ అనుకున్నట్లుగానే కోర్టు మృగాడికి మరణదండన విధిస్తూ తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నారిపై హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ స్థానిక మొదటి అదనపు జిల్లా కోర్టు, పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎం.వెంకటహరినాథ్‌ తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించే చివరి నిమిషంలో. ‘నీపై నేరం రుజువయింది.. ఉరి.. జీవితఖైదు.. జరిమానా పడుతుంది.. ఏం చెప్పాలనుకుంటున్నావు.. ’ అని రఫీని అడిగారు. ‘నేనేం నేరం చెయ్యలేదు.. నా తల్లిదండ్రులు వృద్ధులు.. వారి పోషణ నాపైనే ఆధారపడింది’ అని రఫీ వేడుకున్నాడు. భోజనం అనంతరం న్యాయమూర్తి ఉరిశిక్షవిధిస్తూ మొత్తం 72పేజీలతో తీర్పును ప్రకటించారు. తీర్పుపై 30రోజుల్లో హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లవచ్చని పేర్కొన్నారు. అనంతరం న్యాయమూర్తిని న్యాయవాదులు, పోలీసులు అభినందించారు. పోక్సో కేసులో తొలి మరణదండన తీర్పు చిత్తూరు కోర్టులో వెలువరించడం గమనార్హం.

ఏ రోజున ఏం జరిగింది..?

  • 2019 7వ తేదీ రాత్రి నవంబర్‌ చిన్నారిపై రఫీ ఘాతుకం
  • 8 ఉదయం కల్యాణమండపం వెనక విగతజీవిగా బాలిక
  • 10న రాత్రి నిందితుడి ఊహా చిత్రం విడుదల
  • జిల్లా ఎస్పీ, మదనపల్లె డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల గాలింపు.
  • పాత నేరస్థుల విచారణ
  • కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశం
  • 11 న శవపరీక్ష నివేదికలో విస్తుపోయే నిజాలు
  • 12న నిందితుడి కాల్‌డేటా సేకరణ
  • 16న నిందితుడు రఫీ పట్టివేత
  • 18 బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని మదనపల్లెలో భారీ నిరసన
  • 2020 ఫిబ్రవరి 17 ముగిసిన విచారణ, తీర్పు వాయిదా
  • 24 న ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడి

కేసు నేపథ్యం ఇది..

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం అంగళ్లు పంచాయతీ గుట్టపాళెం గ్రామానికి చెందిన దంపతులు గతేడాది నవంబరు 7న కుమార్తెలతో కలసి కురబలకోట మండలం చేనేతనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో వివాహ శుభకార్యానికి హాజరయ్యారు. తోటి పిల్లలతో ఆడుకుంటున్న చిన్నారిపై నిందితుడు మహ్మద్‌ రఫీ అలియాస్‌ గిడ్డు (25) కన్నుపడింది. ఈక్రమంలో చిన్నారి ఫొటోలు తీస్తూ దగ్గరయ్యాడు. రాత్రి 9.45గంటలకు బాలిక మూత్రశాలకు వెళ్లింది. వెనుకనే నిందితుడు కూడా మూత్రశాల గదిలోకి వెళ్లి.. గడియ వేశాడు. లోపల శబ్దం ఎవరికీ వినపకుండా ఉండటం కోసం కొళాయిని తిప్పాడు. ముఖాన్ని చేతితో మూసి.. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈక్రమంలోనే చిన్నారిని బకెట్‌లోని నీటిలో ముంచి.. హత్య చేశాడు. అనంతరం గడియ తీసి.. కల్యాణ మండపం వెనుక వైపు చిన్నారి మృతదేహాన్ని విసిరేసి వెళ్లాడు. ఈ తరుణంలో కల్యాణ మండపంలో ఐస్‌క్రీమ్‌ పంపిణీ చేస్తున్న ప్రదేశంలో అక్కడి వారితో గొడవ పడ్డాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై కురబలకోట మండలం మొలకవారిపల్లెలోని అత్తారింటికి వెళ్లాడు. ఆ రోజు రాత్రి స్నానం చేసి.. హత్య సమయంలో ధరించిన బట్టలు మార్చుకున్నాడు. చిన్నారి తల్లిదండ్రులు ఇంటికి వెళదామనుకునే సమయానికి పాప కనిపించలేదు. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేదు. మరుసటిరోజు ఉదయం కల్యాణ మండపం వైనుక వైపుగా వెళ్లిన స్థానికులకు చిన్నారి మృతదేహం కనిపించింది. అనంతరం తల్లిదండ్రులు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సవాల్‌గా తీసుకున్న పోలీసులు

ఈ కేసును సవాల్‌గా తీసుకున్న ఎస్పీ సెంథిల్‌కుమార్‌ మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారికి కేసు పరిష్కరించే బాధ్యతను అప్పగించారు. తొలుత కర్ణాటకకు చెందిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు భావించారు. అనంతరం కల్యాణ మండపంలో గొడవ పడిన విధానం, వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని బట్టి ఈ ఘటనకు పాల్పడింది స్థానికుడే అని నిర్ధారించుకున్నారు. సీసీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా నిందితుడి ఊహాచిత్రాన్ని గీయించారు. మదనపల్లె చుట్టుపక్కల 60 కిలోమీటర్ల పరిధిలో ఊహాచిత్రాన్ని గోడలకు అతికించారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో సైతం నిందితుడి చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. వారి కుటుంబసభ్యులు, స్థానికులు ఈ నేరానికి పాల్పడింది రఫీనే అని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నిందితుడు ఎవరనేది పోలీసులకు స్పష్టత వచ్చింది. పోలీసులు నిందితుడిని ఎనిమిది రోజుల వ్యవధిలోనే (నవంబరు 16) మదనపల్లె శివార్లలో అరెస్టు చేశారు. 17 పనిదినాల్లోనే స్థానిక మొదటి అదనపు జిల్లా కోర్టుకు ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.

28మంది సాక్షుల విచారణ

ఈ కేసు విచారణను న్యాయస్థానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో పోలీసులు 41మంది సాక్షులను పేర్కొన్నారు. ఇందులో 28 మందిని 20 రోజుల్లో విచారించారు. ఫిబ్రవరి 17కే కేసు తీర్పు వెలువడాల్సింది. అయితే నిందితుడి తరఫు న్యాయవాది ఏకాంబరంబాబు తన వాదనలను వినిపించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో మరుసటిరోజుకు ఈ కేసును వాయిదా వేశారు. వాదనలు విన్న తర్వాత కోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. ఈక్రమంలో సోమవారం నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ.. న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. మొత్తం 110 రోజుల్లోనే కేసు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించి చరిత్ర సృష్టించారు.

సెక్షన్లు ఇవి..

బాలిక అత్యాచారం కేసులో నిందితుడు రఫీపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోక్సో కేసు, సెక్షన్‌ 376ఏ, సెక్షన్‌ 376ఏబి, సెక్షన్‌ 302 కింద అన్నింటికి కలిపి ఉరిశిక్ష, రూ.3వేల జరిమానా విధించారు. జరిమానా కట్టని పక్షంలో 9 నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. అతడిని కడప సెంట్రల్‌ జైల్‌కు తరలించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి :

'మలేసియాలో ఉద్యోగం అని తీసుకెళ్లారు... చిత్రహింసలకు గురి చేశారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details