ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏడుతరాల బామ్మ.. ఆయుష్షు పెరగాలని ఏం చేశారో తెలుసా? - Grandmother who saw seven generations from Adilabad town news

ఓ శతాధిక వృద్ధరాలు మునిమనవడి నామకరణోత్సవంలో సందడి చేసింది. ఆ వృద్ధురాలి ఆయుష్షు మరింత వృద్ధి చెందాలని బంగారు చెంచాతో.. ఆమె నోట్లో మునిముని మనవడి చేత పాలుపోయించి ఆచారం పాటించారు. తన్మయత్వంతో ఆనందభాష్పాలు కార్చారు.

grandmother
grandmother

By

Published : Feb 17, 2021, 12:48 PM IST

తెలంగాణలోని ఆదిలాబాద్‌ పట్టణం దోబీకాలనీకి చెందిన ఈ బామ్మ పేరు బండి పొచ్చుబాయి. శతాధిక వృద్ధురాలు. వయసు 110 సంవత్సరాలు. మనవడు బండి అశోక్‌ పట్టణంలో ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌. తన తల్లిదండ్రులు చనిపోయినా ఇంటికి పెద్దదిక్కుగా మిగిలిన నాయనమ్మను అశోక్‌ ఎంతో అపురూపంగా చూసుకుంటుంటారు.

ఈ మధ్యనే ఆయనకు మనవడు (కుమారుడి కొడుకు) పుట్టాడు. ఆ చిన్నారికి మంగళవారం కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా నామకరణం చేశారు. బామ్మకు మునిముని మనవడిని (మనవడికి మనవడు) చూపించడం అత్యంత అరుదైనది కనుక.. మొదట ఆమె నోట్లో బంగారు చెంచాతో పాలు పోయాలని పెద్దలు చెప్పారు. దీంతో ప్రత్యేకంగా బంగారంతో చెంచా తయారు చేయించి ఆమెకు పాలు తాపారు. తర్వాత పసికందును ఆమె చేతుల్లో పెట్టి ఆశీర్వాదం తీసుకున్న కుటుంబీకులు భావోద్వేగానికి లోనై సంబరాలు చేసుకున్నారు.

పొచ్చుబాయి కొడుకు, కోడలు చాన్నాళ్ల క్రితమే చనిపోగా మనవళ్లు, మనవరాళ్లు, వాళ్ల బిడ్డలు అంతా కలిసి పాతికమంది వరకు ఉంటారు. వారందరికీ ఆ బామ్మంటే వల్లమాలిన అభిమానం. తన తాతను, తండ్రిని చూసిన ఆమె తన కొడుకును, మనవడు, మునిమనవడితోపాటు తాజాగా మునిముని మనవడిని.. అంటే ఏడు తరాలను చూసినట్లయింది.

వయసు మీద పడితే చీదరించుకునే కుటుంబాలు ఉన్న ఈ రోజుల్లో బామ్మకు మరింత ఆయుష్షు పెరగాలని బంగారు చెంచా ఆచారం పాటించడం ఆదర్శమే కదా..!!

ABOUT THE AUTHOR

...view details