ఒడిశాలోని కటక్లో జరిగిన ఆదికవి శ్రీ సరళాదాస్ 600వ జయంత్యుత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. తొలుత ఉపరాష్ట్రపతి నుంచి ‘కళింగ రత్న’ పురస్కారాన్ని అందుకున్నారు. చిన్నారుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
తరగతి గదులను, తరగతి పుస్తకాలనే కాకుండా అనేక పుస్తకాల ప్రపంచంగా మార్చడం ద్వారా విద్యార్థుల్లో పఠనంతోపాటు వివిధ అంశాలపై ఆసక్తిని పెంపొందించవచ్చని సూచించారు. పరిపాలన, న్యాయ విభాగాల్లో స్థానిక భాష వినియోగాన్ని మరింతగా పెంచడం ద్వారా ప్రజలు తమ విధులను సౌకర్యంగా నిర్వహించేందుకు వీలుంటుందన్న ఉపరాష్ట్రపతి.. కనీసం పాఠశాల విద్య వరకు మాతృభాషలో జరగడం అత్యంత అవసరమన్నారు.