ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాతృభాష నేర్చుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగమివ్వాలి: వెంకయ్య నాయుడు - Vice-President M Venkaiah Naidu attend avv institutions

మాతృభాషను చులకన చేసే జబ్బును తగ్గించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలని.. ఉద్యోగానికి, భాషకు ముడిపెడితేనే అందరూ నేర్చుకుంటారని అన్నారు. నైతిక విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే విద్యార్థుల భవిష్యత్ బంగారు మయమవుతుందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో​ ఆంధ్ర విద్యాభివర్థిని విద్యా సంస్థల 75 సంవత్సరాల వేడుకలను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.

vice president attended avv college celebrations
ఆంధ్ర విద్యాభివర్థిని విద్యా సంస్థల 75 వసంతాల వేడుక

By

Published : Feb 23, 2020, 9:24 PM IST

ఆంధ్ర విద్యాభివర్థిని విద్యా సంస్థల 75 వసంతాల వేడుక

వేలాది మంది విద్యార్థులకు విద్యాదాహం తీర్చిన ఓరుగల్లులోని ఆంధ్ర విద్యాభివర్థిని విద్యా సంస్థలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యా సంస్థల సంచికను ఆయన ఆవిష్కరించారు. మూడున్నర కోట్లతో నిర్మించనున్న ప్లాటినం జూబ్లీ బ్లాక్​కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండా ప్రకాష్, పసునూరి దయాకర్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్​ మేయర్ గుండా ప్రకాష్,​ ఎమ్మెల్యే నరేందర్, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పాశ్చాత్యం తగ్గించుకోవాలి..

మాతృభాష నిరాదరణకు గురవుతోందని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్చాత్య వ్యామోహాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలని అన్నారు. మాతృభాష నేర్చుకుంటేనే ఉద్యోగాలనే అంశాన్ని ప్రభుత్వాలు అమలు చేయాలని సూచించారు. విద్యావిధానంలో మార్పులు రావాలని.. నైతిక విలువలు పెంచే విద్య విద్యార్థులకు అందాలని.. అప్పుడే వారి భవిష్యత్ బాగుంటుందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. నిత్య నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మహిళలపై చిన్నచూపు తగదని, నిర్భయ లాంటి ఘటనలు ఇంకా జరగడం సిగ్గుచేటని అన్నారు. చట్టంతో పాటు మన ఆలోచనా విధానంలోనూ మార్పులు వస్తేనే... ఈ తరహా దుర్ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.

పూర్వ విద్యార్థి కావడం అదృష్టం..

ఇదే పాఠశాల పూర్వ విద్యార్థి కావడం తన అదృష్టమని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల.. ఇక్కడ నుంచే నేర్చుకున్నానని తెలిపారు. ఈ విద్యా సంస్థలు మరింత అభివృద్ధి చెందాలన్న అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలను రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు.

ఘనంగా సత్కారం...

అనేక కార్యక్రమాలున్నప్పటికీ తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు.. విద్యా సంస్థల తరఫున కారదర్శి, అధ్యాపకులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఘనంగా సత్కరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వజ్రోత్సవ వేడుకల్లో విద్యా సంబంధిత సదస్సులు, చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:

లైవ్​ వీడియో: ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!

ABOUT THE AUTHOR

...view details