Schools: పాఠశాలల విలీనంలో మంత్రి, ఉన్నతాధికారులు చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన ఉండటం లేదు. సదుపాయాలున్న చోటనే తరగతులను విలీనం చేస్తామని చెబుతూనే అన్నింటినీ తరలించేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 6, 7, 8 తరగతులను మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. జిల్లా విద్యాధికారులు(డీఈవో) అన్ని పాఠశాలలను తరలించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.
సదుపాయాలు లేనిచోట తాత్కాలికంగా వాయిదా వేయాలని అభ్యర్థిస్తూ డీఈవోలకు కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నా తప్పనిసరిగా తరలించాల్సిందేనని చెబుతున్నారు. విలీనాన్ని ఆపేది లేదని ఉపాధ్యాయ సంఘాలతో గురువారం నిర్వహించిన సమావేశంలోనూ మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ విధానమని ప్రకటించారు.
పాఠశాలల్లో తరగతి గదుల సమస్య ఉన్నందున సెక్షన్లు, పిల్లల సంఖ్యను భారీగా పెంచేశారు. పిల్లలు ఎలా కూర్చుంటారు? వారికి పాఠాలు అర్థమవుతాయా? అనేది పట్టించుకోకుండా విలీనంమే లక్ష్యంగా సెక్షన్లను మార్చేశారు.
కిక్కిరిసి పోవాల్సిందే..
6 నుంచి 8 తరగతుల్లో సెక్షన్కు 52 మంది, 9, 10 తరగతుల్లో సెక్షన్కు 60 మంది విద్యార్థులు ఉండేలా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రాథమికోన్నతలో 35, ఉన్నతలో 40 విద్యార్థులకు ఒక సెక్షన్ ఉండేది. విలీనమయ్యే విద్యార్థులను సర్దుబాటు చేసేందుకు ఒక్కసారిగా సెక్షన్లను పెంచేశారు. సమగ్ర శిక్ష అభియాన్ నిర్మించిన తరగతి గది ఇరుకుగా ఉంటోంది. బ్లాక్బోర్డు నుంచి కొంతదూరం వదిలి కూర్చుంటే 50 మంది విద్యార్థులకే ఆ గది కిక్కిరిసిపోతుంది. అలాంటప్పుడు ఇంత మందిని ఎలా కూర్చోబెడతారు? పిల్లలను ఇరుకిరుకుగా కూర్చోబెట్టి, పాఠాలు అర్థం కాకుండా బడులను కొనసాగించడం వల్ల లాభం ఏమిటి? నాణ్యమైన విద్య ఎలా అందుతుంది? అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ఒక్కోచోట ఒక్కో బోధన..
రాష్ట్రంలో 3-10 తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 1 నుంచి 5 తరగతులు ఉండే ఫౌండేషన్ ప్లస్ బడులకే ఎస్జీటీలను కేటాయించారు. ఇక్కడి 3, 4, 5 తరగతుల వారికి సబ్జెక్టు ఉపాధ్యాయుల బోధన ఉండదు. ప్రభుత్వ బడుల్లోనే ఒకచోట సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన, మరొక చోట ఎస్జీటీలతో బోధన సాగనుంది. మరోపక్క 6, 7, 8 తరగతులు కొనసాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 మంది కంటే తక్కువ ఉంటే ఎస్జీటీలను కేటాయించారు.