DELAY IN LAYOUTS:ప్రైవేట్ లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టులకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం కొత్త అనుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ఏడాది దాదాపు 350 లేఅవుట్లకు వ్యాపారులు అనుమతులు తీసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 20 లేఅవుట్ల (5.71%)కు మాత్రమే అనుమతులు పొందారు. గత ఏడాది 350 లేఅవుట్లకు ఇచ్చిన అనుమతుల ప్రకారం చూసినా...నెలకు సగటున 29 చొప్పున త్రైమాసికానికి 87 వస్తాయి. అయితే 2022-23 మొదటి త్రైమాసికంలో 20 లేఅవుట్లకే వ్యాపారులు అనుమతులు తీసుకున్నారు. తగ్గిన దరఖాస్తులతో పట్టణాభివృద్ధి సంస్థలకు వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. ఏటా రూ.50 కోట్ల వరకు ఫీజుల కింద వచ్చేది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది 50% ఆదాయం రావడం కష్టమేనని అధికారులు అంటున్నారు.
మూడు ఐచ్ఛికాలపైనా వ్యాపారుల్లో అసంతృప్తి
*ఇళ్ల స్థలాల కోసం వేసే లేఅవుట్లలో ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ప్లాట్లు కొనుగోలు చేస్తుంటాయి. లేఅవుట్లో పేదల ఇళ్ల కోసం 5శాతం స్థలాన్ని కేటాయిస్తే..ఇదే చోట కొనుగోళ్లుకు ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలు ఎందుకు ముందుకొస్తాయని వ్యాపారులు అంటున్నారు.
*లేఅవుట్లలో స్థలం ఇవ్వదలచుకోని వ్యాపారులు బేసిక్ విలువ మేరకు ఐదు శాతానికి డబ్బు చెల్లించాలన్న ప్రభుత్వ సూచనపైనా వ్యాపారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ శివారులో పదెకరాల్లో వేసిన లేఅవుట్కు ప్రభుత్వం చెబుతున్న ప్రకారమైతే రూ.5 కోట్ల వరకు డబ్బు చెల్లించాల్సి వస్తుందని ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థ నిర్వాహకుడు శివాజీ తెలిపారు. వ్యాపారం అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో లేఅవుట్ అనుమతులకు ఫీజులతోపాటు మళ్లీ 5శాతం స్థలానికి డబ్బు కట్టి వ్యాపారం చేయడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.