ఎంపీ రఘురామకృష్ణరాజును చికిత్స కోసం రమేశ్ ఆస్పత్రికి తరలించాలన్న అంశంపై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. దీనిపై అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేశ్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్య బృందం నివేదిక ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు. జీజీహెచ్ వైద్య బృందం నివేదికను హైకోర్టు న్యాయమూర్తులు చదివారు.
వాదనల సందర్భంగా ఏఏజీ మాట్లాడుతూ.. ''రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని హైకోర్టుకు వైద్యుల బృందం నివేదిక అందజేసింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. సీఐడీ కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిందిగా శనివారం సాయంత్రం 6.40కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది'' అని వివరించారు. ప్రైవేటు వైద్యులు, సీఆర్పీఎఫ్ భద్రతను హైకోర్టు తిరస్కరించిందని చెప్పారు. జీజీహెచ్ బృందం ఏర్పాటు అంశాన్ని ఈ సందర్భంగా ఏఏజీ హైకోర్టుకు వివరించారు.