ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వీడని వరద భయం... లంక గ్రామాలు విలవిల

By

Published : Oct 16, 2020, 7:22 AM IST

రాష్ట్రంలో కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంత ప్రజలు ఇంకా తేరుకోలేదు. పంట నష్టం జరిగి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు సహా రాష్ట్రంలోని ఏడు జిల్లాలు ఇంకా వరదలతో అల్లాడుతూనే ఉన్నాయి.

floods in state due to heavy rains
వీడని వరద భయం... లంక గ్రామాలు విలవిల

తీవ్ర వాయుగుండం తెచ్చిన ఉపద్రవం నుంచి రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు సహా రాష్ట్రంలోని ఏడు జిల్లాలు వరదలతో అల్లాడుతూనే ఉన్నాయి. పంటలు మునిగి రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఆవాసాలు కోల్పోయిన నిరుపేదల కష్టాలు వర్ణనాతీతం. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఏలేరు జలాశయం దిగువ ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న కాలువలకు 34 చోట్ల గండ్లు పడ్డాయి.
దీంతో కిర్లంపూడి, జగ్గంపేట, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, కాకినాడ నగరం, గ్రామీణ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత నెలలో ఇదే జలాశయం దిగువన వరద ఉద్ధృతికి 27 చోట్ల గండ్లు పడ్డాయి. జిల్లాలో 39,346 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 3,150 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనా. 216 జాతీయ రహదారిపై వరదతో పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి.

వీడని వరద భయం... లంక గ్రామాలు విలవిల

రైతు కుదేలు

* 11 జిల్లాల్లో 2.21 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా లక్ష ఎకరాల వరి నీట మునిగింది. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ నష్టం ఎక్కువగా ఉంది. కృష్ణా, గుంటూరు, విజయనగరం జిల్లాలతోపాటు పలుచోట్ల 33వేల ఎకరాల పత్తి దెబ్బతింది. ఉద్యానశాఖ పరిధిలో రూ.50 కోట్ల వరకు విలువ చేసే 25వేల ఎకరాలకుపైగా పంట నష్టపోయినట్లు అంచనా.
* ఆక్వా రంగంలో 7,437 ఎకరాల్లో చెరువులు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
* విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో వలలు, పడవలు కొట్టుకుపోయి రూ.1.17 కోట్ల నష్టం వాటిల్లింది.

వీడని వరద భయం... లంక గ్రామాలు విలవిల
వీడని వరద భయం... లంక గ్రామాలు విలవిల

పశ్చిమలో భారీ నష్టం

పశ్చిమగోదావరి జిల్లాలో తమ్మిలేరు నీటిమట్టం 25వేల క్యూసెక్కుల నుంచి పది వేల క్యూసెక్కులకు తగ్గడంతో ఏలూరు వాసులు ఊపిరి పీల్చుకున్నారు. యనమదుర్రు డ్రెయిన్‌ ఉద్ధృతికి తణుకు మండలం దువ్వ గ్రామం నీట మునిగింది. పెనుమంట్ర మండలం ఎస్‌.ఇల్లిందుపర్రు గ్రామంలోకి గోస్తనీ వరద చేరింది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలోకి వరద ప్రవేశించింది. కామాక్షి ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. జిల్లావ్యాప్తంగా 281 మి.మీ. వర్షపాతం నమోదైంది. తాడేపల్లిగూడెం సమీపంలోని ఎర్రకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నందమూరు, మారంపల్లి గ్రామాల్లో వరద తాకిడి ఎక్కువైంది. ఈ 2 గ్రామాల్లోని 209 కుటుంబాలకు చెందిన 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరంపాలెంలో ఎర్రకాలువకు గండి పడి శివాలయం మునిగింది. నిడదవోలు మండలం తాళ్లపాలేనికి రాకపోకలు నిలిచాయి. ఎర్రకాలువ పరివాహక ప్రాంత గ్రామాల్లో 3వేల ఎకరాల వరి నీట మునిగింది. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని కోట సత్తెమ్మ తల్లి దేవస్థానంలో మూలవిరాట్టును వరద తాకింది.

వీడని వరద భయం... లంక గ్రామాలు విలవిల

జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు
కృష్ణా నదికి వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి 7.5లక్షల క్యూసెక్కులకుపైగా వదలడంతో తీరం వెంట పొలాల్లో నీరు ప్రవహిస్తోంది. కరకట్ట లోపల లంక గ్రామాలు మునిగాయి. రాకపోకలకు ఈ గ్రామాలవారు నాటుపడవలను ఆశ్రయిస్తున్నారు. కరకట్ట లోపల సాగు చేసిన వేల ఎకరాల ఉద్యాన, వాణిజ్య పంటలు వరద పాలయ్యాయి. ఉద్యానపంటలకు ఎకరాకు రూ.80వేలకుపైగా పెట్టుబడులు పెట్టామని, రూ.35వేల నుంచి రూ.50వేల కౌలు చెల్లించాల్సి ఉంటుందని రైతులు వివరిస్తున్నారు. ప్రస్తుతం రూపాయి రాదని రోదిస్తున్నారు. ఉద్యాన పంటలు 5200 హెక్టార్లు, వ్యవసాయ పంటలు 1800 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని లంక గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.

వీడని వరద భయం... లంక గ్రామాలు విలవిల

చల్లారని విలయం
వరదల వల్ల రాష్ట్రంలో పలుచోట్ల రహదారులు, పైపులైన్లు దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.163 కోట్లు అవసరమని ఆయా శాఖలు ప్రభుత్వానికి నివేదించాయి. మొత్తం 76 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయడంతోపాటు 2,821 కుటుంబాలను తరలించామని, 11,346 మందికి ఆవాసం, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
* రాష్ట్రంలో 2,346 కి.మీ.మేర ఆర్‌అండ్‌బీ రహదారులు ధ్వంసమయ్యాయని అధికారుల అంచనా. 150 కి.మీ. పంచాయతీరాజ్‌ రహదారులు గుంతలమయమయ్యాయి. కాజ్‌వేలు కొట్టుకుపోయాయి.
* శ్రీకాకుళం జిల్లాలో ఓ సబ్‌స్టేషన్‌తో పాటు 18 చోట్ల 33 కేవీ ఫీడర్లు, 10 చోట్ల 11 కేవీ ఫీడర్లపై ప్రభావం పడింది. 98 స్తంభాలు పడిపోయాయి.
* పశ్చిమగోదావరి జిల్లాలోనూ 19 ఫీడర్లతోపాటు 4సబ్‌స్టేషన్లకు నష్టం వాటిల్లింది. విశాఖ జిల్లాలో 372 స్తంభాలు దెబ్బతిన్నాయి.

వీడని వరద భయం... లంక గ్రామాలు విలవిల

పట్టణాల్లోనూ పెనునష్టం
* విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో రహదారులు, తాగునీటి మార్గాలు 111 కి.మీ. మేర దెబ్బతిన్నాయి. యలమంచిలిలో 6 కి.మీ.రహదారి దెబ్బతింది.
* కృష్ణా జిల్లాలో 500 వీధి దీపాలు దెబ్బతిన్నాయి. 6కి.మీ.తాగునీటి గొట్టపు మార్గాలు, 9.58 కి.మీ. భూగర్భ మురుగుకాల్వ వ్యవస్థ, 10.3 కి.మీ. రహదారులకు నష్టం వాటిల్లింది.
* శ్రీకాకుళం జిల్లాలో 165 వీధిదీపాలతోపాటు 5.6 కి.మీ.భూగర్భ మురుగుపారుదల వ్యవస్థకు నష్టం తలెత్తింది.

వీడని వరద భయం... లంక గ్రామాలు విలవిల

ఇదీ చదవండి:

అన్నదాతల జీవితాలు అతలాకుతలం

ABOUT THE AUTHOR

...view details