ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 4, 2020, 11:21 PM IST

Updated : Jun 5, 2020, 1:56 AM IST

ETV Bharat / city

భారత్​కు సాయం కోసం.. బుజ్జి ఎన్​ఆర్​ఐ సాహసం

"లిటిల్ పెడ్లర్స్ అనీష్ అండ్ హిస్ ఫ్రెండ్స్.. 30 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్" ఇదేదో ఇంగ్లీష్ సినిమా.. పేరు కాదండోయ్. ఓ బుడతడు ఫండ్ రైజింగ్ కోసం మెుదలుపెట్టిన కార్యక్రమం. మాతృదేశం భారత్ కోసం ఇంగ్లండ్​లో ఫండ్ రైజింగ్ చేస్తున్నాడో ఐదేళ్ల బుడతడు. ఇంకో విషయం.. బుడ్డోడే కానీ.. 400 ఓవర్ల పాటు క్రీజ్​లోనే ఉన్నాడు.. అదీ ఓ వైద్య ట్రస్టు కోసం.. వయసు చిన్నదైనా.. మనసు పెద్దగా ఉన్న.. ఈ చిచ్చర పిడుగు కథేంటో ఓ సారి చూడండి.

Aneeshwar_Spl Story
Aneeshwar_Spl Story

వయసు చిన్నదే... లక్ష్యం మాత్రం ఉన్నతమైంది. ఆ బుడ్డోడు చేసిన పని.. అందరికీ స్ఫూర్తిని పంచింది. తల్లిదండ్రుల సహకారంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తీరు.. అబ్బురపరుస్తోంది. పేరు.. అనిశ్వర్.. పిల్లాడే అయినా. అనితరసాధ్యుడు.

ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. మన తెలుగోడే. చిత్తురు జిల్లాకు చెందిన స్నేహ, అనిల్ దంపతుల కుమారుడు. ఇంగ్లండ్​లోని వర్రింగ్టన్​లో ఆ కుటుంబం స్థిరపడింది. 2016లో.. ఏడాది వయసున్నప్పుడు.. బాదం పౌడర్ తింటూ అనారోగ్యానికి గురయ్యాడు. క్రికెట్ అంటే ప్రాణం పెట్టే అనీశ్వర్... అదే ఆటతో వైద్యుల కోసం అడుగు ముందుకు వేశాడు. ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకొన్నాడు.

తన స్నేహితులతో కలిసి గివ్ ఇండియా పేరుతో సైక్లింగ్ చాలెంజ్ కు శ్రీకారం చుట్టాడు. "లిటిల్ పెడ్లర్స్ అనీష్ అండ్ హిస్ ఫ్రెండ్స్.. 30 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్" అంటూ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. చిన్నారులందరినీ ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చాడు. తన మాతృదేశానికి విరాళాలు అందించేందుకు అడుగు ముందుకేశాడు.

సైక్లింగ్ ఛాలెంజ్​లో చిన్నారులు

ఆరుగురు చిన్నారులతో మొదలైన ఈ ఛాలెంజ్.. 8 రోజుల్లోనే 41 మందికి చేరిందని.. ఇంకా 22 రోజుల పాటు సైక్లింగ్ ఛాలెంజ్ కొనసాగుతుందని అనీశ్వర్ తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికే లక్షా 70 వేల రూపాయలు సేకరించినట్టు చెప్పారు. లండన్ నుంచి భారత్ కు 23 వేల 700 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని.. బ్రిటన్ లోనే.. చిన్నారులందరితో కలిసి సైక్లింగ్ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఫలితంగా.. మాతృదేశానికి కష్ట కాలంలో అండగా నిలుస్తున్నామన్న సంతృప్తి అనీశ్వర్ తో పాటు తమకూ కలుగుతుందని చెప్పారు.

గతంలోనూ ఇలాగే...

క్రికెట్​లో ఎన్ని ఓవర్లు వరకు ఆడగలరు.. ఓ పది.. ఇరవై.. కుదిరితే.. 50 ఓవర్లు. కానీ అనీశ్వర్ మాత్రం 400 ఓవర్ల పాటు క్రీజ్​లో నిలబడ్డాడు. అది ఎందుకో తెలుసా...? అలర్జీపై అలుపెరగని పోరు చేసిన ఈ బాలుడు.. తనకు వైద్యం చేసిన వైద్యులకు అండగా నిలవాలనుకున్నాడు. ఏడాది వయసులో ఎదురైన అనారోగ్యానికి.. చికిత్స చేసిన వైద్యుల సంక్షేమం కేసం విరాళాలు సేకరించాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్​తో ఈ పని చేశాడు. పది రోజుల పాటు సుమారు 2300 బంతులు ఎదుర్కొని 400 ఓవర్ల పాటు క్రీజ్​లో నిలబడ్డాడు. 3 లక్షల రూపాయలు సేకరించి వైద్య కళాశాల ట్రస్టుకు అందించాడు. తాజాగా సైక్లింగ్ తో భారత్ కు అండగా నిలబడుతున్నాడు. బుడ్డోడే.. కానీ .. మనసున్నవాడు కదూ..!

భారత్​కు సాయం కోసం.. బుజ్జి ఎన్​ఆర్​ఐ సాహసం

ఇదీ చదవండి:

ఈ ఆటోలో చల్ల చల్లటి ప్రయాణం..

Last Updated : Jun 5, 2020, 1:56 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details