కార్మికులు, కర్షకులు అనే భేదం లేకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నూతన వ్యవసాయ చట్టాలపై నిరసనలు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు.. ఏపీలోని పలు జిల్లాల్లో సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి. ఆయా చట్టాలు కార్పొరేట్ శక్తులకు మాత్రమే మేలు చేస్తాయంటూ.. వివిధ రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు.
నెల్లూరు జిల్లాలో...
కేంద్రం అమల్లోకి తెచ్చిన దుర్మార్గపు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా.. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టారు. రైతుల పొట్ట కొట్టి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని పాలకులు దురుద్దేశంతో ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఆ చట్టాల రద్దుకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని.. శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ విద్యుత్ మోటర్లకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు తెచ్చిన జీవోనూ ఉపసంహరించుకోవాలన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు మద్ధతు పలుకుతున్న వైకాపా, తెదేపాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. మర్రిపాడు మండల కేంద్రంలో రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దిల్లీలో రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా.. సీపీఎం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వ్యాపారస్తులు రైతుల వద్ద కొనడం మినహా.. రైతు పంటను ఎక్కడికైనా తీసుకువెళ్లి అమ్ముకునే పరిస్థితి లేదని జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మూలి వెంగయ్య స్పష్టం చేశారు. లోక్సభలో మందబలంతో బిల్లు పాస్ చేయించారని.. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదించారని ఆయన ఆరోపించారు. రైతాంగ విధానాలను వ్యతిరేకించే చట్టాలపై.. కర్షకులందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో...
దిల్లీ పరిసరాల్లో కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను.. ఉగ్రవాదులతో, మావోయిస్టులతో భాజపా నాయకులు పోల్చడం దారుణమని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ విమర్శించారు. ఆ పార్టీ అనంతపురం నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ వేల సంఖ్యలో అన్నదాతలు పాల్గొనడం ఇదే మొదటి సారి అన్నారు. ఇప్పటికే రైల్వే, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలను బడా వ్యాపారులకు కేంద్రం అప్పనంగా ముట్ట చెబుతోందని విమర్శించారు. దేశానికి వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగాన్నీ కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.