ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే తీరు
ఇంటింటి సర్వే చేయకుండానే కొందరు ఆరోగ్య సిబ్బంది వివరాలు నమోదు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కరోనా వ్యాప్తి నివారణ జరగకపోగా... ఎంతోమందికి నష్టం చేకూరుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఎ.ఎన్.ఎం, ఆశా కార్యకర్తల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే చేయిస్తోంది. వాలంటీర్ల సాయంతో వార్డు/సచివాలయ ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వైరస్ అనుమానిత లక్షణాలుంటే పరిశీలించాలి.
జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, వృద్ధులకు ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు, విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినట్లయితే వారి వివరాలు మొబైల్ యాప్లో నమోదు చేయాలి. ఈ క్రమంలో సర్వే వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించినప్పుడు.. కొన్నిచోట్ల ఇళ్లకు వెళ్లకుండానే ఆరోగ్య సిబ్బంది తమకు తోచిన విధంగా వివరాలు నమోదు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలో 1,45,25,952 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 4సార్లు సర్వే జరిగింది. సర్వేల సమాచారాన్ని అధికారులు నిశితంగా పరిశీలించినప్పుడు.. కొన్ని కుటుంబాల వివరాలు అసలు వైద్య ఆరోగ్య శాఖకు అందడంలేదు. ఇంకొన్నిచోట్ల తక్కువ రోజుల్లో, గంటల వ్యవధిలో ఎక్కువ ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించినట్లు మొబైల్ యాప్లో నమోదు చేస్తున్నారు. ఇలా సాధ్యమవుతుందా? అన్న అనుమానాలు జిల్లా అధికారుల్లోనే వ్యక్తమవుతున్నాయి.
అపార్టుమెంట్లకు వెళ్లకుండా, ప్లాట్లలో ఉండే కుటుంబ సభ్యులను కలువకుండానే పక్కనున్న వారు ఏది చెబితే అది రాసేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, ఇతర జిలాల్లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. 4వ సర్వేలో 4 లక్షల కుటుంబాల వివరాలు నమోదు ఇప్పటివరకు జరగలేదు. విశాఖ, కృష్ణా, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది.