ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. ఇది ప్రతి ఆరున్నర సెకన్లకు ఒకరిని బలితీసుకుంటోంది. మన దేశంలో ఏటా 10 లక్షల మంది పొగాకు వాడకం వల్ల చనిపోతున్నారు. ప్రతి వంద క్యాన్సర్ కేసుల్లో 35 పొగాకు ఉపయోగించడం వల్ల వచ్చినవే ఉండటం భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది "క్విట్ టొబాకో టు బి విన్నర్... పొగాకును వదిలేసి విజేతగా నిలవాలి".. అనే థీమ్ను డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. అలాగే కమిట్ టు క్విట్ అనే నినాదాన్ని ఇచ్చింది. దీని ప్రకారం మళ్లీ ఎప్పుడూ పొగాకును తాగనంటూ ప్రతిజ్ఞ చేయాలని సూచించింది.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో గతేడాది లాక్డౌన్ నుంచి గంజాయికి బానిసలై ఆస్పత్రులకు వచ్చే యువకుల సంఖ్య అధికమైందని వైద్యులు చెబుతున్నారు. గంజాయితో పాటు సిగరెట్, మద్యం సేవించడం, గుట్కా, డ్రగ్స్కు అలవాటు పడిన వారు ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు. వీటి వల్ల రక్తంలో డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుందని... దాని ప్రభావంతో హుషారుగా ఉండి అలసిపోతారని చెబుతున్నారు.
మత్తుపదార్థాలు సేవించే అలవాటు ఉన్న వారికి రోగనిరోధక శక్తి త్వరగా క్షీణించి కరోనా బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కొవిడ్ రెండో దశలో యువత అధికంగా కరోనా బారిన పడటానికి కారణం రోగనిరోధక శక్తి తగ్గడమేనని చెబుతున్నారు. మత్తుపదార్ధాలు సేవించడం వల్ల నోరు అపరిశుభ్రంగా మారి నోటి క్యాన్సర్కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. పొగాకులో నికోటిన్తోపాటు దాదాపు 7వేల రకాలు ఉంటాయని ఇవి క్యాన్సర్కు దారి తీస్తాయంటున్నారు. పొగాకు ఉత్పత్తుల వల్ల డీఎన్ఏ ప్రభావితమై... శరీర కణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి క్యాన్సర్గా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు.