తెలంగాణలో ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చే పాలన నడుస్తోందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. తెరాస పాలనను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. ప్రజల చెమట సొమ్మేనంటూ దుయ్యబట్టారు. ఆర్థిక ప్రతిఫలాలతో పాటు ఆత్మగౌరవమూ అంతే ముఖ్యమని ఈటల వ్యాఖ్యానించారు. తనకు కార్యకర్తలే ముఖ్యమని.. కులమతాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. హుజూరాబాద్లో ఎగిరేది కాషాయ జెండానే అని ఉద్ఘాటించారు. ఈ మాటలు మాట్లాడుతూ ఆయన కాస్త తడబడ్డారు. అలవాటులో పొరపాటుగా.."ఎగిరేది గులాబీ జెండానే" అని...వెంటనే సరిదిద్దుకున్నారు.
కేసీఆర్ భయపడుతున్నారు..
ఈటల స్వార్థం, రాజకీయ లబ్ధి కోసం భాజపాలో చేరలేదని తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామిక విలువలు కాపాడాటానికే తెరాసకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు. భాజపాలో ఈటల చేరికను చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని సంజయ్ విమర్శించారు. భాజపాలో చేరేందుకు చాలామంది క్యూలో ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను కొట్టినవారు మంత్రిగా కొనసాగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. వారందరికీ త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు.