BJP Vs TRS: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న హెచ్ఐసీసీలో కలకలం రేగింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం హాల్లోకి ప్రవేశించారంటూ భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులను భాజపా సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి గుర్తించారు.
భాజపా సమావేశాలను చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని భాజపా సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. సమావేశంలో జరిగే చర్చ వివరాలను బయటకు చెప్పేందుకే నిఘా అధికారులు పోలీసు పాస్లతో లోనికి ప్రవేశించారన్నారు. తీర్మానాల కాపీని ఫొటో తీస్తుంటే గుర్తించి పోలీస్ కమిషనర్కు అప్పజెప్పామని.. ఫొటోలు డిలీట్ చేయించామని తెలిపారు. ఏ పార్టీ ప్రైవసీ వాళ్లకి ఉంటుందన్నారు. ఏదైనా ఉంటే డైరెక్ట్ చేయాలి తప్ప ఇలా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు.