ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్‌ సౌధలో తీవ్ర ఉద్రిక్తత... జెన్‌కోలో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

విజయవాడలోని విద్యుత్‌ సౌధలో... విద్యుత్‌ ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం విద్యుత్‌ ఐకాస పిలుపు మేరకు ఉద్యోగులు రిలే దీక్షలు చేస్తున్నారు.కొవిడ్‌ పరిస్థితులను లెక్కచేయకుండా వినియోగదారులకు సేవలు అందిస్తున్న సిబ్బందిపై యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి హామీ లభించకపోవటంతో నిరసన ప్రదర్శనలను కొనసాగిస్తామని జేఏసీ తెలిపింది.

By

Published : Nov 13, 2020, 6:35 AM IST

Electricity employees hunger strike at Vidyut Soudha in Vijayawada
విజయవాడలో విద్యుత్ సౌధ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు

విద్యుత్‌ ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయడం విజయవాడలోని విద్యుత్‌ సౌధలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డిమాండ్ల సాధన కోసం విద్యుత్‌ ఐకాస పిలుపు మేరకు ఉద్యోగులు రిలే దీక్షలు చేస్తున్నారు. వాటిని అడ్డుకోవడానికి గురువారం ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు విద్యుత్‌ సౌధకు చేరుకున్నారు. ప్రధాన ద్వారం దగ్గరే ఉండి 12 మంది ఐకాస నాయకులు, ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇందుకు నిరసనగా సిబ్బంది ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్టు చేసిన వారిని విడుదల చేసేవరకూ ఇక్కడే ఉంటామని ఉద్యోగులు ప్రకటించారు. మొత్తం వ్యవహారాన్ని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌కు వివరించారు. ఆయన హైదరాబాద్‌లో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డికి ఫోన్‌లో ఈ విషయం తెలిపారు. అరెస్టు చేసిన సిబ్బందిపై కేసులు లేకుండా విడిచిపెట్టేలా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. గురువారం సాయంత్రం వారిని విడుదల చేయటంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. పోలీసుస్టేషన్‌ నుంచి విడుదలైనవారు విద్యుత్‌ సౌధకు వచ్చారు. పోలీసులు తమ సెల్‌ఫోన్లు లాక్కుని నిర్బంధించారని తెలిపారు. కొవిడ్‌ పరిస్థితులను లెక్కచేయకుండా వినియోగదారులకు సేవలు అందిస్తున్న సిబ్బందిపై యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. సిబ్బంది అరెస్టుకు నిరసనగా జేఏసీ పిలుపు మేరకు అన్ని డిస్కంలు, జిల్లాల్లోని ఎస్‌ఈ కార్యాలయాల ఎదుట సిబ్బంది బైఠాయించారు. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి హామీ లభించకపోవటంతో నిరసన ప్రదర్శనలను కొనసాగిస్తామని జేఏసీ తెలిపింది. సోమవారం భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అప్పటికీ స్పందించకపోతే ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమవుతామని అన్నారు.

ఉద్యోగుల ఆందోళనతో విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్తత

మూడు వారాలుగా ఆందోళనలు
తొమ్మిది ప్రధాన డిమాండ్ల సాధన కోసం 5 దశల ఆందోళనలకు ఉద్యోగుల ఐకాస గతనెల 19న పిలుపునిచ్చింది. నాలుగో దశలో ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు సిబ్బంది రిలే దీక్షలు చేస్తున్నారు. సిబ్బంది డిమాండ్లపై గత నెల 28న మంత్రి శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌, జెన్‌కో ఎండీ శ్రీధర్‌ నిర్వహించిన చర్చల్లో హామీ రాకపోవటంతో నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నెల 9న ఐకాస నేతలతో యాజమాన్యం చర్చించింది. డిమాండ్లపై హామీ ఇవ్వకుండా, మంత్రితో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి పంపారు. యాజమాన్యం కావాలనే తాత్సారం చేస్తోందని ఐకాస నేతలు ఆరోపించారు.

జెన్‌కోలో సమ్మెపై నిషేధం
జెన్‌కోలో ఆరు నెలలపాటు సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. విద్యుత్‌ సంస్థల్లో 6 నెలల పాటు సమ్మెలు నిషేధిస్తూ గతనెల 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ట్రాన్స్‌కో, డిస్కంలను మాత్రమే పేర్కొంది. కొత్త జీవోలో జెన్‌కోనూ చేర్చింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం... ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details