రాష్ట్రవ్యాప్తంగా జోరువానలు కురుస్తున్నాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరుణుడి దాటికి తడిసి ముద్దయ్యాయి. వర్షాలతో తమ్మిలేరు, ఏలేరు జలాశయానికి వరద నీరు పోటెత్తింది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నెల్లూరు సోమశిల జలాశయానికి భారీగా వరద చేరుతుంది.త
కృష్ణా జిల్లాలో
కృష్ణా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంపలగూడెంలో కట్టలేరు వాగు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో తమ్మిలేరు వంతెన తెగిపడింది. ఫలితంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పామర్రులో భారీ వర్షాలకు బస్టాండ్, గఫార్ సెంటర్, గ్రంథాలయం ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. గుడివాడలో భారీ వర్షానికి ఎన్టీఆర్ క్రీడామైదానం వర్షం నీటితో నిండిపోయింది. దాచేపల్లి నగర పంచాయతీ చెరువులను తలపిస్తోంది. ముదినేపల్లిలోని అంబేడ్కర్ నగర్ కాలనీలో మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
విజయవాడలో కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 24 గంటలు వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరువూరులో కట్లేరు, ఎదుళ్ల వాగు, విప్లవాగు, పడమటి వాగు, తూర్పు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న వరద నీరు, వరద సహాయక చర్యలపై కలెక్టర్ ఇంతియాజ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గుంటూరు జిల్లాలో
గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు నీటి వనరులు జలకళ సంతరించుకున్నాయి. ప్రత్తిపాడు నుంచి గొట్టిపాడు-బోయపాలెం రోడ్డులో నక్కవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని గ్రామాల మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి, పెదకూరపాడు ప్రాంతాల్లో జోరుగా వానులు కురుస్తున్నాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహించటంతో పంటపొలాలు నీటమునిగాయి. పెదకూరపాడు మండలం తాళ్లూరు, పరస వద్ద కాలచక్ర రహదారిపై నీరు చేరింది. సత్తెనపల్లి-అమరావతి, గుంటూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు ఏటీ అగ్రహారం, శాంతినగర్లలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. ఎన్నో ఏళ్లుగా ముంపు సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని.. తమ సమస్యను అధికారులు పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో
వారం రోజుల క్రితం వరకూ వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వాసులు ఇప్పుడు భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురంలోనూ జోరు వానలు పడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రత్తిపాడులో ఏలేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. 13 వేల క్యూసెక్కులకు పైగా నీటిని కిందకు విడిచిపెట్టడం వల్ల కిర్లంపూడి, రాజుపాలెం, గొల్లప్రోలులలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తణుకు బస్ స్టేషన్ నీట మునగటంతో ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు. బ్యాంకు కాలనీలో ఇళ్లలో నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాలలో వరి, అరటి, కంద తోటలు నీట మునగడం వల్ల... నారు మళ్లు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.