ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 19, 2021, 8:51 PM IST

Updated : Dec 19, 2021, 10:08 PM IST

ETV Bharat / city

ఇంట్లో నీ కోసం ఎదురు చూస్తున్నారు బ్రో.. వాళ్లను అనాథలు చేయకు

Drunken Driving: మనకు గాయమైతే మనం అనుభవించేది నొప్పి మాత్రమే. కానీ, మనవాళ్లు మాత్రం నరకం అనుభవిస్తారు!! నొప్పితో మనం పడుతున్న బాధను చూడలేక, దాన్ని తగ్గించడానికి ఏమీ చేయలేక.. చేతగాక.. చేష్టలుడిగి.. నిరోమయంగా.. అయోమయంగా.. ఆవేదనతో.. ఆందోళనతో.. గుండెలు ద్రవించే మానసిక క్షోభ ఎలా ఉంటుందో తెలుసా?? కొంత కాలానికి మానిపోయే గాయం విషయంలోనే ఇలా ఉంటే.. ఇక, నువ్వు లేవని.. తిరిగి రావని.. చచ్చిపోయావని తెలిస్తే ఎలా ఉంటుంది??? నిన్నే నమ్ముకున్న భార్య, నువ్వే ప్రపంచంగా బతికే పిల్లలు, నీపైనే ప్రాణాలు పెట్టుకున్న అమ్మానాన్నలు ఏమైపోతారో.. రేపట్నుంచి ఎలా బతుకుతారో ఆలోచించావా?? ఇంట్లో నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు బ్రో.. వాళ్లను అనాథలు చేసివెళ్లిపోకు.. వాళ్ల బతుకులు శాశ్వతంగా చీకటి చేసిపోకు...

Drunken Driving
Drunken Driving

Drunken Driving: ఐదేళ్ల క్రితం పొరుగు రాష్ట్రమైన తెలంగాణ హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన దారుణాన్ని తెలుగురాష్ట్రాల్లోని ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. మద్యం సేవించి కారు నడిపిన విద్యార్థులు.. ఓ చిన్నారి సహా ఇద్దరి ప్రాణాలు బలిగొన్నారు. డ్రంకెన్ డ్రైవింగ్‌ గురించి మాట్లాడిన ప్రతిసారీ...ఈ దుర్ఘటన కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. అప్పటి నుంచి ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తీవ్రతలో తేడా ఉంటున్నా కారణం మాత్రం నిర్లక్ష్యమే. మద్యం సేవించి వాహనం నడపటం చట్ట విరుద్ధమని పోలీసులు గట్టిగా హెచ్చరికలు చేస్తున్నా తీరు మార్చుకోవటం లేదు. ఏమవుతుందిలే అని ఒళ్లు తెలియనంతగా మద్యం సేవించి స్టీరింగ్ పడుతున్నారు. ఎదుటి వాళ్ల జీవితాల్ని చీకట్లోకి నెడుతున్నారు.

ఒక్కసారిగా కారు వేగంగా వచ్చి..
drunken driving in hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో ఈ నెల 5న అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదమే ఇందుకు ఉదాహరణ. రెయిన్ బో ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఇద్దరు వ్యక్తులు టీ తాగడానికి బయటకు వచ్చారు. రోడ్డు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల ఇద్దరూ మృతి చెందారు. కారుతో సహా అక్కడి నుంచి పారిపోయిన నిందితులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. మోతుదుకు మించి మద్యం సేవించి వాహనం నడపడమే కారమణమని పోలీసుల దర్యాప్తులో తేలింది.

వారం వ్యవధిలో 8 మంది..
drunken driving causes accidents: హైదరాబాద్ లోని కోకాపేట్‌లోనూ ఇలాంటి దుర్ఘటనే జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. పాల ప్యాకెట్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల ముగ్గురు పిల్లలూ అనాథలయ్యారు. మాదాపూర్‌లోని దుర్గం చెరువు నర్సరీ వద్ద ఓ కారు ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి. కారు నడిపిన యువకుడు మద్యం సేవించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలన్నీ 5వ తేదీనే జరిగాయి. ఈ ఘటనలు మర్చిపోకముందే పేట్ బషీరాబాద్​లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటం వల్ల ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కారులో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వారం రోజుల వ్యవధిలోనే 8మంది డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.

విధ్యంసానికి కళ్లకు కడుతున్న ఘటనలెన్నో..
Accidents due to drunken driving: ఇలాంటి ఘోర ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భాగ్యనగరంలోని గచ్చిబౌలి కూడలి వద్ద గతేడాది కారు, టిప్పర్ ను ఢీకొట్టడం వల్ల నలుగురు యువకులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. 5 నెలల క్రితం మాదాపూర్ వద్ద ఓ ఆటోను వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఆటో పల్టీలు కొడుతూ బస్టాప్ లోనికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 2 నెలల క్రితం మాదాపూర్ కూడలి వద్ద ఆగి ఉన్న బైక్‌ను వెనక నుంచి వచ్చి కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనంపై వెనకాల కూర్చున్న సాఫ్ట్​వేర్ ఇంజినీర్ మృతి చెందారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. ఇలా ఎన్నో సంఘటనలు డ్రంకెన్ డ్రైవింగ్‌ సృష్టిస్తున్న విధ్వంసాన్ని కళ్లకు కడుతూనే ఉన్నాయి.

ఈ ఏడాది 35వేల కేసులు..
drunken driving cases: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగిన ప్రమాదాల కారణంగా... ఈ ఏడాది నవంబర్ వరకు 13 మంది చనిపోయారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది 12,673 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ ఏడాది నవంబర్ వరకు 35వేల కేసులను నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్ వల్ల సైబరాబాద్‌లో 1247 ప్రమాదాలు చోటు చేసుకోగా 230మంది చనిపోయారు. 1184మంది గాయపడ్డారు. గతేడాది మృతుల సంఖ్య 177 కంటే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈసారి ఎక్కువ మృతులు ఉండటం గమనార్హం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రమాదాలు, మృతుల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రహదారి ప్రమాదాల కారణంగా 584మంది చనిపోగా...డ్రంకెన్ డ్రైవ్ కారణంగా 5మంది మృతి చెందినట్లు రాచకొండ పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.

శిక్షలు విధించడం లేదు..
Punishment for Drunken driving : ఈ డ్రంకెన్ డ్రైవింగ్‌ కేసుల్లోని నిందితులకు సరైన శిక్షలు విధించటం లేదన్నది ఓ వాదన. ఐదేళ్ల క్రితం పంజాగుట్ట ప్రమాదాన్నే తీసుకుంటే.. ఇప్పటికీ నిందితులకు శిక్ష పడలేదు. అందరికీ బెయిల్ లభించింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసినా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో 2019లో 21,570 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో మద్యం మత్తులో జరిగినవి 246 మాత్రమే అని పోలీస్‌శాఖ చెబుతున్న లెక్క. అంటే మొత్తం ప్రమాదాల్లో కేవలం 1.1 శాతం. అతి వేగం కారణంగా 20,669 ప్రమాదాలు సంభవించాయని నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలు సేకరించలేకపోవడం వల్లే అధిక శాతం ప్రమాదాలను ‘అతివేగం’ ఖాతాలో వేసేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏటా సుమారు 20 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. దాదాపు 6 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో వాహనాలను నడపడమే 20-30% ప్రమాదాలకు కారణమని అనుమానాలున్నా.. దర్యాప్తులో ఆ విషయం తేలడం లేదు.

ఏపీలో కూడా ఎక్కువే...
drunken driving cases: ఇక ఏపీ విషయానికొస్తే...ఇక్కడ కూడా డ్రంకెన్ డ్రైవింగ్‌ వల్ల జరుగుతున్న ప్రమాదాల సంఖ్య తక్కువేమీ కాదు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం చూస్తే... గతేడాది ఏపీలో 17, 924 ప్రమాదాలు జరగ్గా.. 7 వేల మందికిపైగా మృతి చెందారు. వీరిలో 94 మంది మృతికి డ్రంకెన్ డ్రైవింగే కారణమని తేలింది. 2020లో దేశవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవింగ్‌ ప్రమాదాల సంఖ్య చెన్నైలో ఎక్కువగా ఉండగా.. తర్వాత విజయవాడలోనే అధికంగా నమోదైనట్టు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో డ్రంకెన్ డ్రైవింగ్‌ పరీక్షలు సరిగా నిర్వహించక పోవటం వల్ల ఈ స్థాయిలో మరణాలు నమోదయ్యాయన్నది ఓ విశ్లేషణ. కారణాలు ఏం చెప్పుకున్నా... సమస్య తీవ్రత మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

ప్రమాదం చేసి పారిపోతున్నారు..
drunken driving test: మద్యం సేవించి వాహనాలు నడిపిన తర్వాత ప్రమాదం జరిగితే నిందితులకు వెంటనే శ్వాస పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. రక్తంలో ఆల్కహాల్ శాతం 38 కంటే ఎక్కువగా ఉంటే ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేస్తారు. న్యాయస్థానం ముందు ఉంచుతారు. కానీ కొన్ని ఘటనల్లో నిందితులు ప్రమాదం చేసి పారిపోతున్నారు. 2, 3 రోజుల తర్వాత పోలీసులకు చిక్కుతున్నారు. అప్పటికే రక్తంలో ఆల్కహాల్ శాతం తగ్గిపోతుంది. ప్రమాదానికి కారణం మద్యమే అని కోర్టుల్లో నిరూపించడానికి పోలీసులకు సమస్యలు ఎదురవుతున్నాయి.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పక్కాగా..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల విషయంలో పక్కాగా వ్యవహరిస్తున్నారు. మద్యం సేవించి ప్రమాదానికి కారణమయ్యే వ్యక్తిపై 304 పార్ట్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు. అతడికి వాహనం ఇచ్చిన వ్యక్తిపైనా కేసు నమోదు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా అతనికి వాహనం ఇచ్చినందుకు వాహన యజమానిపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వాహనంలో కూర్చున్న వాళ్ల పైనా కేసులు నమోదు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నారని తెలిసి కూడా దాన్ని అడ్డుకోకుండా అదే వాహనంలో ప్రయాణించడం చట్టప్రకారం నేరమని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. అవసరమైతే వాహనంలో కూర్చున్న వాళ్లపైనా కేసులు నమోదు చేయడానికి సైబరాబాద్ పోలీసులు వెనుకాడటం లేదు. ఇంత పక్కాగా హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదు చేయడం లేదు.

పకడ్బందీగా తనిఖీలు..
drunken driving test: హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. 3కమిషనరేట్ల పరిధిలో రోజు వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడిపితే పోలీసులు వెంటనే వాహనదారుడిపై కేసు నమోదు చేస్తున్నారు. ఇది వరకు వాహనం కూడా స్వాధీనం చేసుకొని కోర్టులో కేసు నమోదు చేసిన తర్వాతే వాహనం అప్పగించే వారు. కానీ కొంతమంది వాహనదారులు హైకోర్టుకెళ్లడం వల్ల వెంటనే వాహనం అప్పగించేలా తీర్పు వచ్చింది. ఫలితంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారుడిపై కేసు నమోదు చేసి.. వాహనం మాత్రం హైకోర్టు తీర్పునకు అనుగుణంగా వాహనం అప్పజె ప్పేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ తరహా కేసులకు ప్రత్యేక న్యాయస్థానం ఉంది. కానీ రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో వాహనదారుల కేసుల విచారణలో కాస్త జాప్యం జరుగుతోంది.

ఇదీ చదవండి:

Road Accident: స్కూటీని ఢీకొన్న లారీ.. తల్లీ కూతుళ్లు మృతి!

Last Updated : Dec 19, 2021, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details