ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 17, 2021, 8:11 AM IST

ETV Bharat / city

Dr Rakesh Mishra on Omicron: 'భారీ సంఖ్యలో కేసులు.. ఒమిక్రాన్ వేరియంట్ తీరే అది..'

వేరియంట్లు..వేవ్‌లు..! రెండేళ్లుగా వీటితోనే పోరాటం చేస్తోంది ప్రపంచం. శాస్త్రవేత్తలు శ్రమించి టీకాలు తెచ్చినా.. వైరస్ రూపం మార్చుకుంటూ దాడి చేస్తూనే ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మరోసారి అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే.. 55 దేశాలకుపైగా విస్తరించి వైద్య వ్యవస్థకు సవాలు విసురుతోంది. టీకాలు తీసుకున్నా.. రోగనిరోధక శక్తి వలయాన్నీ ఛేదించుకుని వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే డెల్టా విధ్వంసాన్ని కళ్లారా చూసిన ప్రజలు... ఒమిక్రాన్ ఏ ముప్పు మోసుకొస్తుందోనని వణికిపోతున్నారు. భారత్‌లోనూ కేసులు వెలుగు చూడటం... ఆందోళనను రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ డెల్టా కంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందా? ప్రభుత్వాలు టెస్టింగ్, ట్రేసింగ్​కి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది అన్న అంశాలపై వివరణ ఇచ్చారు.. సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాకేశ్ మిశ్రా. లక్షణాలు స్వల్పంగానే ఉన్నా.. జాగ్రత్తపడకపోతే... మూడో వేవ్ ముంచుకు రావచ్చని అంటున్న డాక్టర్ రాకేశ్ మిశ్రాతో ప్రత్యేక ముఖాముఖి.

Dr Rakesh Mishra on Omicron
Dr Rakesh Mishra on Omicron

'భారీ సంఖ్యలో కేసులు.. ఒమిక్రాన్ వేరియంట్ తీరే అది..'

ప్ర: కొవిడ్ ప్రారంభం నుంచి ఎన్నో వేరియంట్లు వచ్చాయి. ఒమిక్రాన్ మాత్రం ఎందుకింత భయపెడుతోంది?

జ: ప్రతి కొత్త వేరియంట్‌ బ్లాక్‌బాక్స్‌ లాంటిదే. దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలియకపోవడమే సమస్య. ఇప్పటి వరకు చూసిన వేరియంట్లలో ఒమిక్రాన్‌ ప్రమాదకరమైనది. అది సహజమే కూడా. కొత్త వేరియంట్ ఉన్న వైరస్‌తో సమానంగా, లేదా అంతకుమించి సంక్రమణ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆ కారణంగానే ఇప్పుడు అందరి దృష్టి ఒమిక్రాన్‌పై ఉంది. లక్షణాలు స్వల్పమే అయినా... ఒమిక్రాన్‌ వ్యాప్తి తీవ్రతే సమస్య. లక్షణాలు స్వల్పంగా ఉండి... ఆస్పత్రి అవసరం లేకపోయినా.. భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఒమిక్రాన్ తీరే అది.

ప్ర: అలా అయితే ఒమిక్రాన్... డెల్టా-1 కంటే ప్రమాదకరం అనుకోవచ్చా?

జ: మన దృష్టిలో ప్రమాద నిర్వచనం బట్టి ఒమిక్రాన్‌ ముప్పు అంచనా వేయాలి. దీని లక్షణాలు స్వల్పం. చాలామందికి వారికి వైరస్ సోకిందని కూడా తెలియదు. బాధితులు భారీగా ఉంటారు. జనాభాలో చాలామందికి.. బలహీనంగా ఉన్న వారికి దీని ముప్పు ఎక్కువ. అదే సమస్య. ఇప్పుడు బయట రద్దీ పెరిగింది. అందుకే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటోంది. సాధ్యమైన అన్ని మార్గాల్లో వైరస్ వ్యాప్తిని నియంత్రించాలి. అదెలా చేయాలో మనందరికీ తెలుసు. అలా చేస్తేనే.. పరిస్థితి అదుపు తప్పకుండా చూసుకోవచ్చు. ఒమిక్రాన్‌ వేగం వల్ల ఇది ఎక్కువ మందికి సోకడమే కాదు..ఉత్పరివర్తనాల ముప్పు ఉంది. నిరంతరం కాకున్నా.. వేరియంట్లు వస్తాయి. కేసులు పెరిగే కొద్దీ.. వేరియంట్లు, అనిశ్చితి పెరుగుతాయి. డెల్టా కంటే లక్షణాలు తక్కువ ఉన్నా ఒమిక్రాన్‌ భయ పెట్టడానికి కారణం అదే. బెంబేలెత్తాల్సిన పని లేదు. కానీ మహమ్మారి పోలేదు, మనతోనే ఉందని గుర్తించాలి.

ప్ర: మొదటి, 2వ వేవ్‌లు చూశాం. ఎంతో ప్రాణనష్టం జరిగింది. ఒమిక్రాన్‌ 3వ వేవ్‌ను తెస్తోందని అనుకోవచ్చా? అది మొదటి రెండు వేవ్‌ల కంటే తీవ్రంగా ఉండొచ్చంటారా?

జ: వైరస్‌ వేవ్స్‌ భిన్నమైన విషయం. వాటికి వేరియంట్లే అవసరం లేదు. ఒకటే వేరియంట‌్ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా... ఒక్కోచోట ప్రభావం ఒక్కోలా ఉండొచ్చు. ప్రస్తుతం యూరప్‌లోని చాలా దేశాలు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. భారత్‌లో ఆ పరిస్థితి లేదు. రోజువారీ కేసులు 10వేల లోపే ఉంటున్నాయి. యూరప్‌లో కేసుల తీవ్రత ఒమిక్రాన్ వల్ల కాదు. ఉన్న కేసులకు సమాంతరంగా ఒమిక్రాన్ వెలుగుచూసింది. యూరప్‌ కేసులకు కారణం డెల్టా... ఒమిక్రాన్ కాదు. ప్రజలు ప్రవర్తన ఎలా ఉందనేది ప్రధానం. లాక్‌డౌన్ పెట్టినప్పుడు వైరస్ వ్యాప్తి ఆగిందంటే కారణం ప్రజల కదలికల్లేవు. యూరప్‌లో అన్ని తిరిగి తెరిచారు. మాస్క్ ధరించడం మానేశారు. అందుకే వైరస్ ఉద్ధృతి పెరిగింది. ఒమిక్రాన్‌లో వ్యాధి సంక్రమణ ముప్పు ఎక్కువ. ఆదమరిస్తే.. దీంతో మరిన్ని వేవ్స్‌ వేగంగా రావొచ్చు. కాకపోతే ఒమిక్రాన్ మాత్రమే వైరస్ వేవ్‌లకు కారణం కాదు.

2వ వేవ్‌తో పోల్చితే మెరుగైన స్థితిలో ఉన్నాం. వైరస్‌ గురించి ఎక్కువ తెలిసింది. వైద్య వ్యవస్థ సన్నద్ధంగా ఉంది. మెరుగైన చికిత్సా విధానాలు, టీకాలు వచ్చాయి. పెద్దసంఖ్యలో ప్రజలకు టీకాలు అందించారు. త్వరలోనే చిన్నారులకూ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి...వీలైనంత ఎక్కువమందికి టీకాలు వేస్తారు. మొదటి రెండు వేవ్‌లలో ఈ పరిస్థితి లేదు. అదే మన పెద్ద బలం.

ప్ర: ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్‌లో చాలా మార్పులు వచ్చాయి..దాని ఆధారంగా చేసిన వ్యాక్సిన్లు పని చేస్తాయా అనే ప్రశ్నలపై మీరు ఏమంటారు?

జ: నిజమే. ఒమిక్రాన్ స్పైక్‌ ప్రోటీన్‌లో అసాధారణంగా 30 వరకు మార్పులు జరిగాయి. కరోనా వైరస్‌లో స్పైక్‌ ప్రోటీనే కీలక భాగం. ఒకరకంగా చెప్పాలంటే వైరస్ వ్యాప్తికి అదేతాళం. అది తెరుచు కోవడం బట్టే శరీరంలో వైరస్ వ్యాప్తి ఉంటుంది. టీకాల లక్ష్యం ఆ స్పైక్‌ప్రోటీనే. దానిని నిర్వీర్యం చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నాయి. యాంటీబాడీలకు చిక్కకుండా వైరస్‌ తన రూపు మార్చుకోవచ్చు. అయితే అది ఎంత మారినా కొన్ని పరిమితులు ఉంటాయి. ఎక్కడో చోట తాళం తెరుచుకోని పరిస్థితి ఉంటే వైరస్ వ్యాప్తి కూడా జరగదు. ఇప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతోంది అంటే దాని స్పైక్‌ ప్రోటీన్‌ను చేరుకునే మార్గం ఉన్నట్లే. అంటే దానిలోని కొన్ని భాగాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. అవి మారవు. వాటిని లక్ష్యం చేసుకునే టీకాలు పని చేస్తాయి. ఏ వ్యాక్సిన్‌కు చిక్కకుండా వైరస్ పూర్తిగా రూపాంతరం చెందడం సాధ్యం కాదు. కాకపోతే ఆయా టీకాల స్వరూపం బట్టి వాటి సామర్థ్యాలు మారొచ్చు.

యాంటీబాడీల తర్వాత స్థానంలో టీ సెల్స్ రక్షణ కూడా కీలకం. వైరస్ బారిన పడినా... టీకా తీసుకున్నా... యాంటీబాడీలతో పాటు... మెమరీ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. అవి నిద్రాణంగా ఉన్నా... వైరస్‌ దాడి చేసినప్పుడు క్రియాశీలకంగా మారి ప్రతిదాడి ప్రారంభిస్తాయి. అందుకే వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. అవి వైరస్‌ను ఆపలేవు, కానీ శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని నియంత్రించగలవు. కాబట్టి 2 డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉంటే.. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. 1, 2 వేవ్‌లతో పోల్చితే ఇప్పుడు సీరో పాజిటివిటీ ఎక్కువ ఉంది. 70% నుంచి 80% ప్రజలు సీరో సర్వేల్లో పాజిటివ్‌గా తేలారు. అంటే వైరస్ బారిన పడి ఉండడం వల్ల వారందరిలో యాంటీ బాడీలు ఏర్పడ్డాయి. బహుశా తీవ్రస్థాయిలో విరుచుకు పడిన 2వ వేవ్‌ వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. తీవ్రస్థాయిలో నష్టం చేసినా... ఇప్పుడు అదే సానుకూలంగా మారింది. పెద్ద నగరాల్లో 90% జనాభా సీరో పాజిటివ్‌గా తేలారు. దానికి టీకాల వల్ల వచ్చిన రక్షణ అదనం. అందువల్లనే లక్షణాలు, వ్యాధి తీవ్రత తక్కువ ఉంటోంది. అంటే 3వ వేవ్‌ వచ్చినా.. తీవ్రత తక్కువ ఉండొచ్చు. అయితే అది మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే మెరుగైన స్థితిలో ఉన్నాం. మాస్క్ ధరిస్తూ... వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేసి బలహీనంగా ఉండే వారిని జాగ్రత్తగా చూసుకుంటే.. 3వ వేవ్ ముప్పు తప్పించుకోవచ్చు.

ప్ర: మీరు టీ సెల్స్, వ్యాక్సినేషన్, ఇప్పటికే వైరస్‌ బారిన పడి ఉండడం గురించి చర్చించారు. ఐతే కొంతమంది ఒమిక్రాన్‌తో రీఇన్‌ఫెక్షన్ ముప్పు ఎక్కువంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి? సీరో పాజిటివిటీ రేటు బాగున్నా ఒమిక్రాన్ ఎందుకింత భయపెడుతోంది?

జ: ఈ వైరస్‌కు ఉన్న శక్తి అదే. ఇది మొత్తం మార్చేయగలదు. ఇప్పుడు మనకు యాంటీబాడీల రక్షణ ఉంది. దానివల్ల ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. తీవ్ర అనారోగ్యానికి గురికాము. కానీ కొంతమందిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. వయోభారం లేదా కొన్ని అనారోగ్యాల కారణంగా తక్కువ రోగ నిరోధక శక్తి కలిగిన వారుంటారు. వాళ్లకు ఎంత రక్షణ కల్పించినా... వైరస్‌తో ప్రమాదం పొంచి ఉంటుంది. టీకాలు ఇన్‌ఫెక్షన్‌ను ఆపడానికి కాదు. అవి వ్యాధి తీవ్రతను నియంత్రిస్తాయి. టీకాలు ఆ పనిచేస్తూనే ఉంటాయి. అందువల్లనే చాలా తక్కువ మందికే ఆస్పత్రి అవసరం పడుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనూ మొదటి కొన్ని వందల కేసుల్లో... అవి టెస్టింగ్‌కు వెళితే బయటపడ్డవి కాదు. వేరే అనారోగ్యాలతో ఆస్పత్రులకు వెళితే... నిబంధనల ప్రకారం చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలారు. లక్షణాలు లేకపోవడం వల్లనే ఒమిక్రాన్ మరణాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అంటే వైరస్ నుంచి రక్షణలు పని చేస్తున్నాయి. కానీ జాగ్రత్తలు వదిలేస్తే వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. కొంతమంది.. లక్షణాలు లేనప్పుడు ఎందుకు భయపడాలని అనుకోవచ్చు. కానీ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒక వైరస్‌కు మీరు వాహకంగా మారుతున్నారని గుర్తించాలి. దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండొచ్చు. అందుకే వైరస్‌కు మనతో ఆడుకునే అవకాశం ఇవ్వకూడదు. టీకా రక్షణకు అదనంగా మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లకూడదు. ఆ రెండూ చేస్తే వైరస్‌కు వ్యాప్తి అవకాశం ఉండదు. కొందరు.. 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. వయసులో ఉన్నాం...నాకేం ముప్పని అనొచ్చు. అలాంటి వారికి కూడా వైరస్ సోకవచ్చు. వారి నుంచి మరో వ్యక్తికి వ్యాపించవచ్చు. ఎవరిలో వైరస్ ఉందో మనకు తెలియదు. లక్షణాలు లేకపోవడమంటే అదే. వైరస్‌ దాగి ఉండి.. వ్యాప్తి చెందుతుంది. బలహీనంగా ఉన్న వ్యక్తి దాని బారిన పడినప్పుడు నష్టపోతాడు. ఆస్పత్రి పాలవొచ్చు.. ప్రాణాలే పోవచ్చు... చాలా జరగొచ్చు. ఆ నష్టాల్ని ఆపాలి.

ఇదీ చూడండి:

Omicron Cases in Telangana: తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసులు.. ఏడుకు చేరిన సంఖ్య

ABOUT THE AUTHOR

...view details