ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏం చేయాలి? లక్షణాలు మొదలైన మొదటిరోజు నుంచి అవి తగ్గేవరకు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్యుల్ని ఎప్పుడు సంప్రదించాలి? ఆసుపత్రిలో ఎప్పుడు చేరాలి? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఏం తినాలి? చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నలివి. ఇక కుటుంబంలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఇంటిల్లిపాదికీ ఆందోళన మొదలవుతోంది. ఏ డాక్టర్ను సంప్రదించాలో, ఏ మందులు వేసుకోవాలో తెలియక తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ ప్రశ్నలకు ఏలూరు ఆశ్రమ్ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ అందిస్తున్న సవివర సమాచారం ఇది.
ఏ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1 వ రోజు..
ప్రస్తుతం కరోనా వైరస్ ఇంట్లో ఒకరికి సోకితే.. ఇంట్లోని మిగతావారికీ వేగంగా సంక్రమిస్తోంది. కాబట్టి ఒంటి నొప్పులు, జలుబు, గొంతునొప్పి, జ్వరం, నీరసం వంటి లక్షణాలేవి కనిపించినా అది కరోనాగానే భావించి సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్లాలి. జలుబు, జ్వరం వంటి లక్షణాలుంటే వాటి నివారణకు సిట్రజెన్, పారాసెటమాల్ వంటి మందులు వేసుకోవచ్చు. వీలైతే లక్షణాలు కనిపించిన మొదటిరోజే కుటుంబ వైద్యుణ్నిగానీ, ఎవరైనా ఫిజీషియన్నుగానీ సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది. జలుబు ఉంటే ఆవిరి పట్టుకోవాలి.
2 వ రోజు..
ఐసొలేషన్లోనే ఉంటూ వ్యాధి లక్షణాలు తగ్గడానికి డాక్టర్ సూచించిన మందులు వాడాలి. కొత్త లక్షణాలేమైనా వస్తే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటికి మందులేమైనా సూచిస్తే వాడటం ప్రారంభించాలి. ఆవిరి పట్టడం కొనసాగించాలి.
3 వ రోజు..
వ్యాధి లక్షణాలు కొనసాగుతుంటే కరోనానా? కాదా? నిర్ధారించుకొనేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. సాధారణంగా లక్షణాలు మొదలైన మూడో రోజు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తే కరోనా సోకిందీ లేనిదీ స్పష్టంగా తెలిసే అవకాశముంటుంది. వాడుతున్న మందులు కొనసాగించాలి.
4 వ రోజు..
ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వచ్చినా వ్యాధి లక్షణాలకు మందులు కొనసాగిస్తూ ఐసొలేషన్లోనే ఉండాలి. పాజిటివ్ వస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. వారి సూచన మేరకు శరీరంలో వైరస్ పెరగకుండా నిరోధించేందుకు అవసరమైన యాంటీ వైరల్ మందులు వాడటం ప్రారంభించాలి. పల్స్ఆక్సీమీటర్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి. కూర్చుని ఒకసారి, వారు ఉంటున్న గదిలోనే ఆరు నిమిషాలు నడిచాక మరోసారి రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందో పరీక్షించుకోవాలి. ఇలా రోజుకు నాలుగుసార్లు చేయాలి. ఆక్సిజన్ 95 శాతం కంటే తగ్గితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.
5 వ రోజు..
జ్వరం తగ్గకపోవడం, జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతోపాటు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కూడా మొదలైతే తక్షణం వైద్యులను సంప్రదించి సీటీస్కాన్, రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిది. వైద్యుల సలహా మేరకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీరం ఫెర్రిటిన్, సి రియాక్టివ్ ప్రొటీన్, డి-డైమర్, ఎల్డీహెచ్ వంటి రక్తపరీక్షల్ని చేయించుకోవాలి. అయిదు రోజులైనా తీవ్రమైన వ్యాధి లక్షణాలు కొనసాగుతున్న పెద్ద వయస్కులు, రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో లేనివారు ఆసుపత్రిలో చేరడం మంచిది.