ఏళ్లు గడుస్తున్నా.. రాష్ట్ర ఖజానా శాఖకు సంబంధించిన కోట్ల రూపాయలు రికవరీ కావడం లేదు. శాఖాపరమైన విచారణలు నామమాత్రమే అవుతున్నాయి. గట్టి చర్యలు తీసుకుంటారనే భయం లేకపోవడం వల్ల అక్రమాలు పునరావృతమవుతూనే ఉన్నాయి.
రూ.కోట్లలో అక్రమాలు
పింఛనర్లకు, తెలంగాణకు చెందిన వారికీ ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర భృతి చెల్లింపులు రెండేళ్లుగా కొనసాగాయి. కొన్నిచోట్ల 70 ఏళ్లు నిండకముందే అదనపు పింఛను జమ చేసిన ఉదంతాలున్నాయి. వివిధ జిల్లాల్లో పదేళ్లలో అనేక చోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయి. విశాఖ జిల్లా చింతపల్లి, సీతమ్మధార, గుంటూరు జిల్లా తెనాలి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, అడ్డతీగల, ఒంగోలు.. ఇలా అనేక ఖజానా కార్యాలయాల్లో పింఛన్ల పేరుతో కుంభకోణాలు బయటపడ్డాయి. చనిపోయిన పింఛనుదారుల పేరిట భారీగా సొమ్ము స్వాహా చేశారు. కొత్త ఖాతాలు తెరిచి పింఛను సొమ్ము మళ్లించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.75 కోట్ల మేర సొమ్ము దుర్వినియోగమైంది. వాస్తవంగా ఈ మొత్తం రూ.100 కోట్లకు పైమాటేనని చెబుతున్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే రూ.45 కోట్ల మేర పక్కదారి పట్టింది. చింతపల్లిలో వైద్యబిల్లుల పేరుతో దాదాపు రూ.30 కోట్లు స్వాహా అయ్యాయి. ఇందుకు కారణమైన ఒక ఉన్నతోద్యోగిని రాజకీయ జోక్యంతో మరో శాఖలో జిల్లాస్థాయి అధికారిగా నియమించారు. గోదావరి జిల్లాల్లో కొన్ని అక్రమాల్లో భాగస్వామ్యమున్న అధికారిని ఇప్పటికీ కేంద్ర కార్యాలయంలో కీలక విధుల్లో వినియోగించుకుంటున్నారు.