ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 25, 2020, 8:35 AM IST

ETV Bharat / city

కొవిడ్‌ టీకా డ్రై రన్‌కు తెలంగాణ ఎంపిక

కొవిడ్‌ టీకాను డ్రై రన్​కు దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. ఇందులో దక్షిణాది నుంచి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది. టీకా ఇచ్చేటప్పుడు ఎటువంటి విధానాలను అవలంబిస్తారో.. వాటన్నింటినీ డ్రై రన్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. కేంద్రం సూచనల నేపథ్యంలో కొవిడ్‌ టీకా సన్నాహకాలపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇవాళ సమావేశం కానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

corona vaccine dry run in Telangana
corona vaccine dry run in Telangana

కొవిడ్‌ టీకాను ప్రజలకు అందించే క్రమంలో తొలుత సన్నద్ధత పరీక్ష (డ్రై రన్‌) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఇందులో దక్షిణాది నుంచి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది. మిగిలిన రెండింటిలో ఒకటి హరియాణా కాగా.. మూడో రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్‌ లేక గుజరాత్‌ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. సమగ్ర సార్వత్రిక టీకాల అమలు కార్యక్రమం ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ అమలులో మూడేళ్ల క్రితం దేశంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. మీజిల్స్‌-రుబెల్లా(ఎంఆర్‌) టీకా, పోలియో ఇంజక్షన్‌.. తదితరాలనూ సమర్థంగా అమలు చేసింది. ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకొని కొవిడ్‌ టీకా అమలులో ముందస్తు సన్నద్ధత పరీక్ష నిర్వహణకు తెలంగాణను ఎంపిక చేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

అమలులో సమస్యల్ని గుర్తించడానికే

టీకా ఇచ్చేటప్పుడు ఎటువంటి విధానాలను అవలంబిస్తారో.. వాటన్నింటినీ డ్రై రన్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. కొవిడ్‌ టీకాలు రాష్ట్రానికి చేరినప్పటి నుంచి అత్యంత శీతల కేంద్రంలో నిల్వ ఉంచడం.. అక్కడినుంచి జిల్లా స్థాయిలో నిల్వ కేంద్రానికి తరలించడం.. ఆ తర్వాత ఆసుపత్రిలో టీకా ఇవ్వడం.. ఈ క్రమంలో పాటించే జాగ్రత్తలు, అనుసరించే విధివిధానాలను అణువణువునా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. అతి సూక్ష్మలోపాలనూ క్షుణ్నంగా గుర్తించి నమోదు చేస్తారు. తద్వారా ఏ దశలో ఎటువంటి క్రమబద్ధీకరణ అవసరమో గుర్తించి చక్కదిద్దుతారు.

రాష్ట్రంలో 3 లక్షల మందితో తొలి జాబితా

దేశం మొత్తమ్మీద 30 కోట్ల మందికి తొలి విడత కొవిడ్‌ టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కోటి మంది ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బంది కలిపి 2 కోట్ల మంది, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోటి మంది, 50 ఏళ్లు పైబడిన 26 కోట్ల మందికి తొలి విడతలో టీకా అందజేయాలని నిర్ణయించారు. తెలంగాణ నుంచి ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో పనిచేస్తున్న సుమారు 3 లక్షల మంది వైద్యులు, సిబ్బంది జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్రం సూచనల నేపథ్యంలో కొవిడ్‌ టీకా సన్నాహకాలపై తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు బుధవారం సమావేశం కానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:

తమిళనాడులో హత్యచేశారు.. రామాపురంలో చిక్కారు

ABOUT THE AUTHOR

...view details