ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టీకా ఉత్సవ్: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొవిడ్ వ్యాక్సినేషన్

టీకా ఉత్సవ్​లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని వెల్లడించారు. గుంటూరు జిల్లాలో కలెక్టర్, ఆర్డీవోలు ఆయా వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలకు వెళ్లి ప్రక్రియను పరిశీలించారు. ప్రకాశంలో టీకాపొందిన వారితో ఆర్డీవో శేషిరెడ్డి మాట్లాడి పరిస్థితి సమీక్షించారు.

By

Published : Apr 15, 2021, 7:03 AM IST

covid vaccination in ap, ap teeka utsav
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్, ఏపీలో టీకా ఉత్సవ్

రాష్ట్రంలో బుధవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 6,17,182 మందికి కరోనా టీకాలు వేశారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 68,358 మందికి.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 34,048 మందికి అందించారు. కేంద్రం నుంచి తాజాగా వచ్చిన 6.40 లక్షల కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ డోసులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో సుమారు 1,400 గ్రామ, వార్డు సచివాలయాలు, పీహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వాసుపత్రుల ద్వారా ఈ పంపిణీ జరిగింది. ఇప్పటివరకూ రోజూ సగటున 1.25 లక్షల మందికి పంపిణీ జరగ్గా.. రికార్డుస్థాయిలో ఒకేరోజు 6.17 లక్షల డోసులను పంపిణీ చేయడం గమనార్హం. ఇంతకుముందు మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోనే అత్యధికంగా రోజుకు 2లక్షల డోసులు ఇచ్చారు. టీకా ఉత్సవం చివరిరోజు కావడం, ప్రజల నుంచి స్పందన రావడంతో ఈ స్థాయిలో డోసులు పంపిణీ చేశామని, ఒక్క రోజులో ఇన్ని డోసులు ఇవ్వడం దేశంలో ఇదే మొదటిసారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని వెెల్లడించారు. ఒక్కరోజే 6 లక్షల డోసులూ ఇచ్చేయడంతో గురువారం నుంచి టీకాలు ఏ స్థాయిలో పంపిణీ చేస్తారన్నది తెలియడం లేదు. కేంద్రం నుంచి మళ్లీ వ్యాక్సిన్‌ వస్తేనే టీకాల పంపిణీ వేగంగా జరుగుతుంది.

గుంటూరులో...

రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ పునరుద్ధరించిన సందర్భంగా.. టీకా పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. బాపట్ల, పొన్నూరు నియోజకవర్గాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. జిల్లాలోని 197 టీకా కేంద్రాల్లో కనీసం రోజుకు 500 మందికి వ్యాక్సిన్ వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సిబ్బందికి సూచించారు.

టీకా ఉత్సవ్‌లో భాగంగా పిడుగురాళ్ల మండలం కరాలపాడులో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. టీకా తీసుకున్న వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. గురజాల ఆర్డీవో పార్థసారధిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్‌ కేంద్రాలకు నిర్దేశించిన లక్ష్యాలు నూరుశాతం అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీకా వేయించుకున్న వారు సైతం మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం వంటి అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, స్థానిక ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు.

ఇదీ చదవండి:'కరోనా టీకాలు అందుబాటులో ఉంచుతాం!'

ప్రకాశంలో...

మార్కాపురం డివిజన్​లో కొవిడ్ టీకాను ప్రజలకు వేగంగా అందించాలని ఆర్డీవో ఎం.శేషిరెడ్డి అధికారులను ఆదేశించారు. త్రిపురాంతకం మండలంలోని కేశినేనిపల్లి, వై.పాలెం పంచాయతీల్లో జరుగుతున్న వ్యాక్సిన్ పంపిణీని ఆయన పరిశీలించారు. వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు అందరూ టీకాలు వేయించుకోవాలని కోరారు. వ్యాక్సిన్​ పూర్తిగా సురక్షితమని.. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరిస్తూ.. సామాజిక దూరం పాటించాలన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 4,157 కేసులు, 18 మరణాలు

ABOUT THE AUTHOR

...view details