ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 13, 2020, 7:52 AM IST

ETV Bharat / city

తెలంగాణ: యథేచ్ఛగా వీధుల్లోకి.. కట్టడి లేని వేళ.. కరోనా ఆగేదెలా..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​కు కొత్త ఉపద్రవం పొంచి ఉంది. స్వీయ గృహ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకోవాల్సిన పలువురు కరోనా బాధితులు వీధుల్లోకి వచ్చేస్తున్నారు. స్నేహితులను, ఇతరులను వారు కలుస్తుండడం వైరస్‌ వ్యాప్తికి మరింత కారణమవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో మార్పు తేవాల్సిన జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగిన దృష్టిసారించడం లేదు.

covid-19-patients-home-quarantine-but-many-outside-on-roads-in-hyderabad
హైదరాబాద్ కరోనా వార్తలు

హైదరాబాద్‌లో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య దాదాపు 25 వేలకు చేరింది. ప్రస్తుతం 11 వేల మంది వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతోపాటు హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు పూర్తి చికిత్స చేసి నయమైన తరువాతే ఇంటికి పంపిస్తున్నారు. అయితే తమ నివాసాల్లోనే ఉండి వైద్యుల సలహాల ఆధారంగా చికిత్స పొందుతున్నవారిలో కొందరు బయటకు వచ్చేస్తున్నారు. కరోనా సోకిన వారున్న ప్రాంతాలను మొదట్లో కట్టడి ప్రాంతం(కంటైన్‌మెంట్‌ జోన్‌)గా ప్రకటించి కఠిన ఆంక్షలు అమలుచేసేవారు. మారిన పరిణామాలతో వారున్న ఇంటినే కట్టడి జోన్​గా ప్రకటిస్తున్నారు. గత 15 రోజులుగా బల్దియా అధికారులు ఈ చర్యలు సైతం తీసుకోవడం లేదు.

నిత్యం వెయ్యికి పైగా..

పరీక్షల సంఖ్య పెరగటంతో మహానగరంలో రోజూ వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. లక్షణాలు తీవ్రంగా లేకపోవటంతో వేలాదిమంది ఇళ్లలోనే ఉంటున్నారు. వీరికి వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి పూర్తిస్థాయిలో సహాయం అందడం లేదు. చాలామంది ప్రైవేటు వైద్యులను సంప్రదించడానికి బయటకొస్తున్నారు. వైద్య ప్రక్రియ పూర్తయిన తరువాత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మరికొంతమంది సొంత పనుల కోసం వెళుతుండడం, సాధారణ జనంతో కలసిపోవటంతో వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. కూకట్‌పల్లి, షేక్‌పేట, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో కేసులు అధికంగా వస్తున్నాయి. పాజిటివ్‌ వచ్చినవారికి యంత్రాంగం దిశానిర్దేశం చేస్తూ కచ్చితంగా 14 రోజులపాటు ఇళ్లలోనే ఉండేలా చూడాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదులు అందటంతో..

  • షేక్‌పేట్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు రోగులు 4 రోజులుగా బయట తిరగడం మొదలెట్టారు. సమీప ఇళ్ల వారు బల్దియా అధికారులకు ఫిర్యాదు చేస్తే వారికి హెచ్చరిక చేసి ఇంట్లోనే ఉండేలా చేశారు. సంబంధిత ఇళ్లను కంటైన్‌మెంట్‌గా ప్రకటించారు.
  • సికింద్రాబాద్‌లోని ఓ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కరోనా బారినపడ్డారు. వీరి గురించి అధికారులు పట్టించుకోలేదు. సొంతంగా వైద్యులను ఫోన్‌లో సంప్రదించి ఔషధాలను వాడటం మొదలుపెట్టారు. మూడో రోజు నుంచే బయట తిరిగారు. స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయటంతో ఆ ఇంటిని నిఘాలో ఉంచారు.

ఇలా చేస్తే ఉపయుక్తం

  • కరోనా పరీక్షల ఫలితాలు వచ్చిన వెంటనే బల్దియా అధికారులు గతంలోలాగే చర్యలు చేపట్టాలి. 14 రోజులపాటు బయట తిరగకుండా నిఘా పెట్టాలి.
  • ఆశా సిబ్బంది రోగిని కలిసి ధైర్యం చెప్పి వైద్య సలహాలతోపాటు మందులను అందించాలి.
  • బల్దియా సిబ్బంది రోజుకు 2 సార్లు బాధితులకు ఫోన్‌ చేసి ఆరోగ్యం గురించి తెలుసుకోవడమే కాకుండా ఇంట్లోనే ఉన్నారా లేదా అని ఆరా తీయాలి.

ABOUT THE AUTHOR

...view details