రాష్ట్రంలో కొవిడ్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. మార్చి 18న 0.69 శాతం ఉన్న పాజిటివిటీ రేటు రెండు వారాల వ్యవధిలో 3.99 శాతానికి చేరింది. గతేడాది అక్టోబరు 27న రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.88 శాతంగా నమోదైంది. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. గతేడాది డిసెంబరు 10 నుంచి ఈ ఏడాది మార్చి 19 వరకు (ఒక్క రోజు మినహా) పాజిటివిటీ రేటు ఒక శాతంలోపే ఉండేది. మార్చి 19 తర్వాత నుంచి రోజురోజుకు వైరస్ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 31,809 నమూనాలు పరీక్షించగా.. అందులో 1,271 మందికి పాజిటివ్గా తేలింది. అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్ బారిన పడి మరణించారు. 24 గంటల్లో 464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,51,14,988 నమూనాలు పరీక్షించారు. 9,03,260 కేసులు వెలుగుచూశాయి. మరణాలు 7,220కు చేరాయి. క్రియాశీలక కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఇవి 8,142 ఉన్నాయి.
ఆ నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో నమోదైన కొవిడ్ కేసుల్లో 914 (71.91 శాతం) చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 285 కొత్త కేసులొచ్చాయి. క్రియాశీలక కేసులూ ఈ జిల్లాల్లోనే అత్యధికంగా ఉన్నాయి.
ఆర్టీసీ ప్రయాణీకులకు మాస్క్ తప్పనిసరి!