ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 2, 2021, 9:06 AM IST

ETV Bharat / city

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 3.99 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు

రాష్ట్రం‌లో కరోనా‌ కేసుల తీవ్రత పెరుగుతోంది. మార్చి 18న 0.69 శాతం ఉన్న పాజిటివిటీ రేటు రెండు వారాల వ్యవధిలో 3.99 శాతానికి చేరింది.

కరోనా వైరస్
corona death toll in ap

రాష్ట్రం‌లో కొవిడ్‌ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. మార్చి 18న 0.69 శాతం ఉన్న పాజిటివిటీ రేటు రెండు వారాల వ్యవధిలో 3.99 శాతానికి చేరింది. గతేడాది అక్టోబరు 27న రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.88 శాతంగా నమోదైంది. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. గతేడాది డిసెంబరు 10 నుంచి ఈ ఏడాది మార్చి 19 వరకు (ఒక్క రోజు మినహా) పాజిటివిటీ రేటు ఒక శాతంలోపే ఉండేది. మార్చి 19 తర్వాత నుంచి రోజురోజుకు వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 31,809 నమూనాలు పరీక్షించగా.. అందులో 1,271 మందికి పాజిటివ్‌గా తేలింది. అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్‌ బారిన పడి మరణించారు. 24 గంటల్లో 464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,51,14,988 నమూనాలు పరీక్షించారు. 9,03,260 కేసులు వెలుగుచూశాయి. మరణాలు 7,220కు చేరాయి. క్రియాశీలక కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఇవి 8,142 ఉన్నాయి.

ఆ నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో నమోదైన కొవిడ్‌ కేసుల్లో 914 (71.91 శాతం) చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 285 కొత్త కేసులొచ్చాయి. క్రియాశీలక కేసులూ ఈ జిల్లాల్లోనే అత్యధికంగా ఉన్నాయి.

ఆర్టీసీ ప్రయాణీకులకు మాస్క్‌ తప్పనిసరి!

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణికులంతా తప్పనిసరిగా మాస్క్‌ ధరించేలా చూడాలని, మాస్క్‌లేకపోతే, బస్సుల్లోకి ప్రవేశం కల్పించొద్దంటూ అన్ని జిల్లాల ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. బస్టాండుకు వచ్చే అందరికీ మాస్క్‌ ఉండటం తప్పనిసరి చేయాలని సూచించారు. ఆర్టీసీ కార్యాలయాల్లో ఉద్యోగులంతా మాస్క్‌ ధరించి.. సామాజిక దూరం పాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

పదిమంది ఆర్‌టీసీ ఉన్నతాధికారులకు కరోనా
విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం.. బస్‌భవన్‌లో పది మంది ఉన్నతాధికారులకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. ఇందులో ఒక ఈడీతో సహా ఉన్నత స్థాయిలో ఉన్న ఇంజినీర్లు వివిధ విభాగాల అధిపతులు ఉన్నారు. దీంతో ఆర్టీసీ ఎండీ ఆర్‌పీ ఠాకూర్‌ స్పందించి ఎండీ పేషీతో పాటు అన్ని ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్ల పేషీలు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు కరోనా పరీక్షలకు అవకాశం కల్పించారు. కరోనా పరీక్షల వాహనాన్ని బస్‌భవన్‌ వద్దకే రప్పించి 70 మందికి పరీక్షలు జరిపారు. ప్రధాన కార్యాలయంలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కేసులు రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి

జమ్మూలో.. తితిదేకు 62 ఎకరాల స్థలం కేటాయింపు

ABOUT THE AUTHOR

...view details