ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాడీవేడీగా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాలు

By

Published : Mar 2, 2021, 9:54 AM IST

నగర పాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు రేపే చివరి రోజు. ఈ నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహలకు కసరత్తులు చేస్తున్నాయి. బుధవారం సాయంత్రానికి అభ్యర్థులు ఎవరెవరూ బరిలో నిలిచారనే దానిపై స్పష్టత రానుండటంతో అందుకు తగ్గ కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. గురువారం నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనేందుకు సిద్ధమవుతున్నారు.

Corporation Election
Corporation Election

వాడీవేడీతో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాలు

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 64 డివిజన్లలోనూ ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటాపోటి ప్రచారం నిర్వహిస్తున్నారు. 61 వ డివిజన్లో వైకాపా అభ్యర్థి రమాదేవి తరఫున ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆరో డివిజన్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. 52 డివిజన్‌లో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగూల్ మీరా.. ఓటేయాలని అభ్యర్థించారు. 42వ డివిజన్లో.. జనసేన నేత పోతిన వెంకట మహేష్ ప్రచారం చేశారు.

ఒంగోలులో ఎన్నికల ప్రచారాలు పుంజుకుంటున్నాయి. అనంతపురం జిల్లా కదిరి పీఠంపై సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం నేతలు ఉంటున్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే తమ పార్టీని గెలిపించాలని కోరారు. అనంతపురంలోని 23వ డివిజన్లో అభ్యర్థి హరిత.. ఇంటింటికీ వెళ్లి ఓటేయాలని కోరారు. కదిరిలో ఓటర్ల జాబితా విషయంలో తలెత్తిన వివాదం కారణంగా.. వైకాపా, భాజపా ఒకరిపై ఒకరు బాహాబాహీగా దిగారు. కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా హోరాహోరీ ప్రచారాలతో దూసుకుపోతున్నారు. అభ్యర్థులను ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడుతున్నారు. గుంటూరులో జరగనున్న ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిపించాలని జనసేన నేత శ్రీనివాస్‌ కోరారు. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రచారం చేశారు. కర్నూలు నగరంలో 22వ వార్డులో ప్రచారంలో తెదేపా సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.

పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, శాంతిభద్రతల రక్షణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో నామినేషన్ ఉపసంహరణ కేంద్రాల వద్ద ఏర్పాట్లను సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ్ పరిశీలించి.. అధికారులకు అవగాహన కల్పించారు. వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని సూచించారు. ఈసారి వివాదాలకు కారణమున్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని గుంటూరు ఎస్పీ విశాల్‌ గున్నీ ఆదేశించారు. మున్సిపల్‌ ఎన్నికల వేళ.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదోని డీఎస్​పీ వినోద్ కుమార్ సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని.. అభ్యర్థులంతా పాటించాలని కృష్ణా జిల్లా నూజివీడు డీఎస్పీ కోరారు. పబ్లిక్‌ ప్రాంతాల్లో పార్టీలకు చెందిన బ్యానర్లు ఉంచరాదని తెలిపారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా.. మద్యం, నగదు అక్రమ రవాణాపై ప్రత్యేక దష్టి పెట్టారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం గొల్లపల్లి వద్ద ఓ వ్యక్తి కారులో 334 కర్ణాటక మద్యం పాకెట్లు పట్టుబడ్డాయి. హిందూపురంలో 5 లక్షల విలువ గల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు శివారులోని బుడంపాడు చెకపోస్ట్ వద్ద.. ఓ కారులో 5 లక్షల రూపాయలతో, ఒక కారు, బైక్‌ ను సీజ్‌ చేశారు.

ఇదీ చదవండి:

బలవంతంగా ఉపసంహరణలు జరిగిన చోట.. నేడు మళ్లీ నామినేషన్లు!

ABOUT THE AUTHOR

...view details