ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 3, 2020, 10:27 AM IST

ETV Bharat / city

కరోనా బాధితుడు 14 రోజుల్లో ఎంతమందిని కలిశాడు.. వారి పరిస్థితి ఏంటి?

హైదరాబాద్‌కు చెందిన కరోనా నిర్ధారిత యువకుడు గత రెండు వారాల్లో ఎవరెవర్ని కలిశాడనేది ఇప్పుడు అతి కీలకమైన అంశంగా మారింది. వైరస్‌ ప్రయోగశాలలో నిర్ధారణ కావడానికి 14 రోజుల ముందు నుంచే నిద్రాణంగా శరీరంలో ఉంటూ.. వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నందున.. వైద్యఆరోగ్యశాఖ ఇప్పుడీ విషయంపై తీవ్ర ఆందోళన చెందుతోంది.

coronavirus-effect-in-telangana
హైదరాబాద్ యువకుడికి కరోనా

కరోనా వైరస్‌ నిర్ధారిత యువకుడు దుబాయి నుంచి వచ్చిన తర్వాత రెండు రోజుల పాటు బెంగళూరులో ఉద్యోగానికి వెళ్లాడు. అక్కడ ఎవరెవర్ని కలిశాడు? సన్నిహితంగా మెలిగిన సహచరులెవరు? వీరిలో తెలంగాణకు చెందినవారెవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాల్లేవు.

యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బస్సులో 27 మంది ప్రయాణికులున్నట్లుగా గుర్తించారు. అది ఏసీ బస్సు కాబట్టి వైరస్‌ త్వరగా వ్యాప్తిచెందే అవకాశాలున్నాయి. ఇప్పుడా 27 మందిని గుర్తించిన వైద్య యంత్రాంగం.. వారందరికీ గాంధీలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లుచేసింది. వీరు కాకుండా బాధితుడి కుటుంబ సభ్యులు, మిత్రులు మరో 11 మంది. వీరిని అత్యవసరంగా గాంధీకి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

42 మంది అనుమానితులు..

ఈ రెండు గ్రూపులు కాకుండా సికింద్రాబాద్‌ అపోలోలో చికిత్స చేసిన వైద్యబృందంలోనూ 42 మందిని అనుమానితులుగా గుర్తించారు. అపోలో ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ అనుమానంతో చికిత్స చేయడం కూడా కొంత వరకూ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకున్నట్లు అవుతుందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే స్వైన్‌ఫ్లూ చికిత్సలో భాగంగా ఈ యువకుడిని విడి గదిలో ఉంచి చికిత్స చేశారు.

అయితే ఈ చికిత్సలో ప్రత్యక్షంగా పాల్గొన్న వైద్యుడికి కరోనా వైరస్‌ సోకే అవకాశాలున్నాయనే భావనతో వైద్యసిబ్బంది ఆయనను అత్యవసరంగా గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.

80 మంది సన్నిహితులు..

మొత్తంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బందితో పాటు 80 మందిపైగానే సన్నిహితంగా మెలిగినట్లుగా వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. వీరందరికీ కచ్చితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది.

అయితే బాధిత యువకుడితో సన్నిహితంగా మెలిగిన ఈ 80 మంది గత రెండువారాలుగా ఎవరెవరితో కలిశారు? ఎక్కడెక్కడికి వెళ్లారనేది కూడా ఇప్పుడు ముఖ్యమైన అంశమే. పరీక్షల్లో వైరస్‌ లేదని తేలినా కూడా ఈ 80 మందిని మరో రెండువారాల పాటు వారి ఇళ్లలోనే విడి గదుల్లో ఉండేలా ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంది.

రెండు నుంచి మూడుకు..

కరోనా వైరస్‌ కేరళలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ముగ్గురూ చైనా నుంచి నేరుగా వచ్చినవారే. అయితే ఇప్పుడు తెలంగాణలో నమోదైన కేసు ఇందుకు భిన్నం. హాంకాంగ్‌లో కరోనా సోకిన వ్యక్తి ద్వారా ఈ యువకుడికి సోకినట్లుగా అనుమానాలున్నాయి. అంటే ఇది నేరుగా కాకుండా మరో వ్యక్తి (సెకండ్‌ కాంటాక్ట్‌) ద్వారా వ్యాపించిందని తెలుస్తోంది.

ఇప్పుడీ వైరస్‌ రెండో వ్యక్తి నుంచి మూడో వ్యక్తి (థర్డ్‌ కాంటాక్ట్‌)కి కూడా వ్యాప్తిచెందితే.. ఇక వైరస్‌ను అడ్డుకోవడం కష్టమనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్న 80 మందిలో గనుక వైరస్‌ లేకపోతే పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నట్లు అవుతుందని వైద్యులు భావిస్తున్నాయి.

మిలటరీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు!

ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స చేస్తున్నా.. ఇతర వ్యాధులతో నిత్యం ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య 2వేలకు పైగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కరోనా బాధితులను గాంధీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించడం అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో కూడా ఇదే విషయం చర్చకు వచ్చినట్టు సమాచారం.

ప్రస్తుతానికి ఇక్కడ చికిత్సలు కొనసాగిస్తూనే ఛాతీ ఆసుపత్రిలో మొదటి అంతస్తులో కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్స వార్డును నెలకొల్పాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి సైతం అత్యవసర ఏర్పాట్లకు ఆమోదం తెలిపారు.

యుద్ధప్రాతిపదికన ఐసీయూలు, పడకలు, వెంటిలేటర్ల కొనుగోలుకు ఆరోగ్యశాఖ నిర్ణయించింది. పరిస్థితి తీవ్రరూపం దాల్చితే.. 10 అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఒకేసారి కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాల్సిన పరిస్థితులు నెలకొంటే.. అప్పుడెలా? అనే చర్చకూడా వచ్చిందని సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మిలటరీ అధికారులు తమ వద్దనున్న 100 పడకల ఆసుపత్రికి కరోనా బాధితుల చికిత్స కోసం వినియోగించుకోవాలని కోరాగా. ఆ దిశగానూ దృష్టిపెటింది.

ఎవరూ పట్టించుకోలేదు..

ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్‌ కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరారు. బ్యాంకాక్‌ వెళ్లిన ఆమెకు దగ్గు, జలుబు ఉండటం వల్ల ఆదివారం గాంధీ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ సిబ్బంది ఆమెను ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అయితే గంటలు గడిచినా తనను ఎవరూ పట్టించులేదనీ, కనీసం శాంపిళ్లు కూడా తీసుకోలేదని ట్విటర్‌ వేదికగా సీఎంవో కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది సోమవారం ఆమె నుంచి శాంపిళ్లు తీసుకొని పరీక్షకు పంపారు.

మాస్కుల ధరలకు రెక్కలు..

గత కొన్నిరోజులుగా మాస్క్‌లకు నగరంలో డిమాండ్‌ ఏర్పడింది. ఇదే అదనుగా కొందరు మందుల దుకాణాల యజమానులు ధరలు పెంచి విక్రయిస్తున్నారు.

ఇవీ చూడండి:3 వేలు దాటిన కరోనా మరణాలు- మరిన్ని దేశాలకు విస్తరణ

ABOUT THE AUTHOR

...view details