హైదరాబాద్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వనస్థలిపురం పరిధిలో ఒకే కుటుంబంలో 8 మందికి సోకిన మహమ్మారి.. అందులో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. మిగతా ఆరుగురిని ఆసుపత్రి పాల్జేసింది. వీరికి సన్నిహితంగా ఉన్న 169 కుటుంబాలను అధికారులు స్వీయ నిర్బంధంలో ఉంచారు. వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో ఉంటున్న ఓ కుటుంబంలో ముగ్గురికి వైరస్ సోకింది. వీరి ద్వారా ఎస్కేడీ. నగర్, మరో ప్రాంతంలోని బంధువుల కుటుంబాలకు చెందిన అయిదుగురు కరోనా బారిన పడ్డారు. ఇందులో ఇద్దరు పిల్లలూ ఉన్నారు.
వనస్థలిపురంలోని బాధితులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న 52 కుటుంబాలను, ఎస్కేడీ నగర్లోని బాధితులతో సన్నిహితంగా ఉన్న మరో 117 కుటుంబాలను హోం క్వారంటైన్లో ఉంచారు. వీరుగాక స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన 25 మందినీ హోం క్వారంటైన్లో ఉంచారు. లాక్డౌన్ వేళ నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తికి చికిత్స చేసిన వనస్థలిపురంలోని జీవన్సాయి ఆసుపత్రిని శనివారం జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. ఎస్కేడీ నగర్, వనస్థలిపురం రైతుబజార్ సమీపంలోని ‘ఎ టైప్’ క్వార్టర్స్, ‘బి టైప్’ క్వార్టర్స్ కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా చేశారు.
ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో 9 మంది, ఫీవర్ ఆసుపత్రిలో ఏడుగురు శనివారం అనుమానిత లక్షణాలతో చేరారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి చికిత్సకు నిమ్స్కు రాగా కరోనా లక్షణాలుగా అనుమానించి వైద్యులు గాంధీకి తరలించారు. అలాగే కుందన్బాగ్లో ఓ వ్యక్తి(55)కి కరోనా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతను ఓ అపార్టుమెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు.
మరో వైపు ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని పంజాగుట్ట, సోమాజిగూడలతో పాటు బల్కంపేటలో ఒక ప్రాంతం, చంచల్గూడలోని నుక్కడ్ ప్రాంతంలోని వీధిలోని కంటైన్మెంట్ జోన్లను అధికారులు ఎత్తివేశారు.
కడచూపునకూ నోచుకోలేదు...
కరోనాతో మృతి చెందిన తండ్రి కడచూపునకు కుమారులు నోచుకోలేదు. మాదన్నపేట ఠాణా పరిధిలో ఉంటున్న వృద్ధుడు నెల కిందట ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. అతనికి సరైన చికిత్స అందడం లేదని కుమారులిద్దరూ వైద్యులతో గొడవపడటంతో కేసు నమోదైంది. వీరికీ కరోనా సోకడం వల్ల గాంధీలో చికిత్స చేశారు. శనివారం పరీక్షల్లో వీరికి నెగెటివ్ రావడం వల్ల నేరుగా చంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే రోజు తండ్రి మృతి చెందడంతో వారిద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరైంది. కానీ అంత్యక్రియలకు వారిని అనుమతించక పోవడం వల్ల తండ్రిని కడసారి చూసుకోలేకపోయారు. తండ్రి చికిత్స కోసమే గొడవపడి.. ఆఖరికి చివరి చూపునకు నోచుకోలేకపోయామని కంటతడిపెట్టారు.