ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 16, 2020, 1:43 PM IST

ETV Bharat / city

కరోనా దెబ్బకు ఆతిథ్య రంగం కుదేలు

కరోనా దెబ్బకు కకావికలమైన రంగాల్లో ఆతిథ్య పరిశ్రమ మొదటి వరుసలో ఉంటుంది. ఏడాది కాలంగా అంతంతమాత్రంగా ఉన్న ఈ రంగం.. వైరస్ విలయంతో కుదేలవుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. లాక్‌డౌన్ తర్వాత... ప్రజల ఆలోచనల్లో మార్పుల వల్ల మరి కొంతకాలం ఆతిథ్యరంగానికి చిక్కులు తప్పవంటున్నారు నిపుణులు.

corona effect on hotels in ap
corona effect on hotels in ap

కరోనా దెబ్బకు ఆతిథ్య రంగం కుదేలు

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లు, లాడ్జ్‌లు, గెస్ట్‌హౌస్‌లు కుదేలవుతున్నాయి. రెస్టారెంట్లు, బ్యాంకెట్ హాళ్లదీ అదే పరిస్థితి. ఇన్నాళ్లూ అడపాదడపా సమావేశాలతో... ప్రధాన నగరాల్లో ఆతిథ్యరంగానికి ఆక్యుపేషన్‌లో ఢోకా లేకుండా ఉండేది. విజయవాడలో త్రీ స్టార్, ఆపై రేటింగ్ ఉన్న హోటళ్లు సుమారు 10 ఉన్నాయి. త్రీ స్టార్ లోపు రేటింగ్‌తో 100 వరకూ ఉన్నాయి. లాడ్జ్‌లు, ఇతర చిన్నతరహా హోటళ్లు మరో 300 వరకూ ఉన్నాయి. వీటికి అనుబంధంగా 150 పెద్ద రెస్టారెంట్లు సహా చిన్న, మధ్యతరహా రెస్టారెంట్లు 250 వరకూ ఉన్నాయి. ప్రభుత్వ అనుబంధ కార్యక్రమాలు తగ్గడం, రాజధాని మార్పు ప్రకటన పరిణామాలతో... ఇప్పటికే వీటిల్లో ఆక్యుపెన్సీ 60 నుంచి 40 శాతానికి పడిపోయిందని యజమానులు చెబుతున్నారు. ఇప్పుడు వైరస్ దెబ్బ... మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైందని వాపోతున్నారు

కొన్ని రోజుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేసినా జనం ఇప్పటికిప్పుడు హోటళ్ల గడప తొక్కే అవకాశం లేదని నిర్వాహకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గడం వల్ల ఇప్పట్లో ఎవరూ ఇళ్ల నుంచి కదలకపోవచ్చని అంటున్నారు. అనేక కారణాలతో నష్టాలు చవిచూడక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఆదాయం లేక... నష్టాలు భరించలేక..ఇప్పటికే ఉద్యోగులు, సిబ్బందిని చాలా హోటళ్లు ఇళ్లకు పంపేశాయి.

లాక్‌డౌన్ తర్వాత ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్టుగా హోటళ్ల ఆక్యుపెన్సీలో మార్పులు అనివార్యం. భౌతిక దూరానికి తగ్గట్టుగా అంతర్గత మార్పులు చేసుకోవాలంటే నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతాయని ఆందోళనలో ఉన్నారు యజమానులు. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఫిక్స్‌డ్ విద్యుత్ ఛార్జీలు తగ్గించడం సహా జీఎస్​టీ, ఇతర పన్ను రాయితీ కల్పించాలని కోరుతున్నారు.

ప్రజల తాకిడి మునుపటిలా మారితే తప్పా.. పరిశ్రమ ఎప్పుడు గాడిన పడుతుందో చెప్పడం కష్టమేనని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:'గబ్బిలాల ద్వారానే కరోనా వ్యాపించి ఉండొచ్చు'

ABOUT THE AUTHOR

...view details