ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సడలింపుల ఫలితం.. కరోనా వ్యాప్తి ఉద్ధృతం

లాక్​డౌన్​ సడలింపులతో రాష్ట్రంలో ఇటీవల కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు 491 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 101 మంది మృతి చెందారు. కర్నూలు జిల్లా 1,247 కేసులతో మొదటి స్థానంలో ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. భౌతిక దూరం, స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

By

Published : Jun 21, 2020, 8:33 AM IST

సడలింపుల ఫలితం.. కరోనా వ్యాప్తి ఉద్ధృతం
సడలింపుల ఫలితం.. కరోనా వ్యాప్తి ఉద్ధృతం

రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తున్న తీరు బెంబేలెత్తిస్తోంది. పాజిటివ్‌ కేసుల గ్రాఫ్‌ రోజురోజుకు పైపైకి ఎగబాకుతోంది. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర స్థాయిలో విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 వరకు రాష్ట్రంలో 491 కొత్త కేసులు నమోదయ్యాయి. మన రాష్ట్రంలో 390, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 83, విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు ఏ రోజుకారోజు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనాతో రాష్ట్రంలో తాజాగా మరో ఐదుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 101కి చేరింది. 24 గంటల వ్యవధిలో అనంతపురం జిల్లాలో అత్యధికంగా 97 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,247 కేసులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది.

  • ఈ నెల 18 నుంచి 20 వరకు.. 3 రోజుల వ్యవధిలోనే 1,732 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 83 మందికి కొత్తగా కరోనా పాజిటివ్‌ తేలగా, వారిలో అత్యధికంగా 30 మంది తెలంగాణ నుంచి వచ్చినవారే ఉన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన 27 మందికి కరోనా సోకింది.
  • అత్యధికంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో 785 మందికి కరోనా సోకింది. తర్వాత స్థానాల్లో తమిళనాడు 297, తెలంగాణ 212 ఉన్నాయి.
  • విదేశాల నుంచి వచ్చిన వారిలో మొత్తంగా 326 మందికి కరోనా సోకింది. బాధితుల్లో అత్యధికంగా 289 మంది కువైట్‌ నుంచి వచ్చిన వారే. తాజాగా 18 మందికి కరోనా నిర్ధారణ కాగా.. వారిలో కువైట్‌-11, దుబాయి-3, మస్కట్‌-3, బహ్రెయిన్‌-3, సూడాన్‌-1 చొప్పున ఉన్నారు.
  • రాష్ట్రంలో కట్టడి ప్రాంతాల సంఖ్య శుక్రవారంనాటికి 836కి చేరింది.

నమూనాల సేకరణకు 52 ఇంద్ర బస్సులు

నిర్ధారణ పరీక్షలను ముమ్మరం చేయడానికి 52 ఆర్టీసీ ఇంద్ర బస్సుల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నమూనాల సేకరణకు వీలుగా ఈ బస్సుల్లో మార్పుచేర్పులను చేసేందుకు రూ.2 లక్షల చొప్పున వెచ్చిస్తున్నారు. వైద్య సిబ్బంది బస్సు లోపల ఉండి నమూనాలు సేకరిస్తారు. వాటిని సమీపంలోని పరీక్ష కేంద్రాలకు పంపుతారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలకు బస్సులను పంపిస్తారు.

చిత్తూరు జిల్లాలో వైరస్​ విజృంభణ

చిత్తూరు జిల్లాలో వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్‌ బాధితులతో ఇప్పటికే తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రి నిండిపోయింది. గతంలో తిరుపతి రైల్వేస్టేషన్‌లో 21 కోచ్‌లను క్వారంటైన్‌ వార్డులుగా మార్చినా వాటిని వినియోగించలేదు. ప్రస్తుతం మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో వీటిని వినియోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు కోచ్‌ల కిటికీలకు శనివారం మస్కిటో నెట్‌ను అమర్చారు. ప్రతి బోగీలో ఒక వైద్యుడు ఉంటారు.

తిరుపతిలో లాక్‌డౌన్‌!

తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో 111 మందికి కరోనా పాజిటివ్‌ రావడం వల్ల లాక్‌డౌన్‌ ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్‌కు నివేదించామని, ఆయన్నుంచి అనుమతి రాగానే 2, 3 రోజుల్లో అమలు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా తెలిపారు.

బయటినుంచి వచ్చేవారి వల్లే..

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ, మహారాష్ట్రల నుంచి ఏపీకి ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. విదేేశాల నుంచి ఇప్పటివరకు 5,600 మంది రాష్ట్రంలోకి ప్రవేశించారు. ఈ కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు ప్రభుత్వం శనివారం తెలిపింది. స్థానికంగా ప్రజల రాకపోకలు పెరిగిపోతున్నందువల్ల కూడా కేసులు అధికమవుతున్నాయని వివరించింది. రాష్ట్రంలో తొలి లాక్‌డౌన్‌ను మార్చి 24 నుంచి అమలు చేశారు. అప్పటివరకు 8 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొదటి మూడు లాక్‌డౌన్‌ల కాలంలో సగటున వరసగా రోజుకి 25, 63, 55 చొప్పున కేసులు వచ్చాయి. 4వ లాక్‌డౌన్‌ సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి వలస కార్మికుల రాకపోకలు పెరగడం వల్ల కేసుల సంఖ్య రోజుకి 89కి చేరింది. జూన్‌ 1వ తేదీ నుంచి ఆంక్షలు సడలించిన తరవాత నిత్యం సగటున 238 కేసులు నమోదవుతున్నాయి.

జిల్లాలవారీగా కేసుల వివరాలు

జిల్లా 24 గంటల వ్యవధిలో మొత్తం కేసులు మరణాలు
అనంతపురం 97 789 6
చిత్తూరు 51 515 5
తూర్పుగోదావరి 41 485 5
గుంటూరు 17 742 11
కడప 15 330 0
కృష్ణా 51 982 33
కర్నూలు 15 1,247 33
నెల్లూరు 6 459 4
ప్రకాశం 16 175 2
శ్రీకాకుళం 0 59 1
విశాఖపట్నం 15 261 1
విజయనగరం 1 78 0
పశ్చిమగోదావరి 65 498 0

ఇదీ చూడండి..

అఖిలపక్ష సమావేశంపై వివాదం సరికాదు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details