ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోతిరెడ్డిపాడు విస్తరణ ఆపేలా ఆదేశాలివ్వండి : తెలంగాణ సీఎం కేసీఆర్

పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం తక్షణమే ఆపేలా ఏపీకి ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం జలశక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్​ను తెలంగాణ సీఎం కేసీఆర్​ కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ కూాడా తెలంగాణకు ఇవ్వాలన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రికి 14 పేజీల లేఖ రాశారు. లేఖలో ప్రస్తావించిన ఏడు అంశాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం అజెండాలో చేర్చాలని కోరారు.

By

Published : Oct 3, 2020, 12:55 AM IST

Updated : Oct 3, 2020, 1:03 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కి తెలంగాణ సీఎం కేసీఆర్ 14 పేజీల లేఖ రాశారు. ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం తక్షణమే ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాలకు తగిన వాటా కేటాయింపులు చేయాలని కేసీఆర్ కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు. ఏడు అంశాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం అజెండాలో చేర్చాలని కోరారు.

తెలంగాణకు కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయాన్ని సవరించాలని కేసీఆర్ కోరారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా, హక్కు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు జరిగే నష్టం, కృష్ణా నదీయాజమాన్య బోర్డు అసమర్ధ పర్యవేక్షణ, విభజన చట్టంలోని సెక్షన్ 89కి సంబంధించిన అంశాలు, గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు, గోదావరి జలాల వినియోగం అజెండాలో చేర్చాలని కోరారు.

కేంద్రం నిర్లిప్తత వల్లే కృష్ణాజలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కలేదన్నారు. సాగునీటిలో తెలంగాణకు అన్యాయం జరిగిందని బచావత్ ట్రైబ్యునల్ చెప్పిందన్నారు. బచావత్ ట్రైబ్యునల్ చెప్పినా ఇన్నేళ్లుగా న్యాయం చేయకపోవడం బాధాకరమని తెలిపారు. నదీజలాల కేటాయింపులు చేయాలని పలుమార్లు ప్రధానిని కోరినా ఫలితం లేదన్నారు. తెలంగాణ వాటాపై ఎందుకు అన్యాయం చేస్తున్నారో కారణం తెలియాలన్నారు.

కృష్ణాజలాల కేటాయింపు చేయకుండా బోర్డుల పరిధి గురించి చర్చించడం అర్థరహితమని కేసీఆర్ లేఖలో ప్రస్తావించారు. గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు అర్థం లేనివన్నారు. ఏపీ ప్రస్తావించిన 7 ప్రాజెక్టులు కొత్తవి కావన్న కేసీఆర్.. కాళేశ్వరం నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోసేలా మొదట్నుంచే పనులు చేపట్టామన్నారు. కాళేశ్వరం ప్రారంభించే సమయానికే మూడో టీఎంసీ పనులు 95 శాతం పూర్తిచేశామన్నారు.


పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల నుంచి దృష్టి మళ్లించేందుకే ఏపీ అభ్యంతరాలు చెబుతోంది. గోదావరి క్యాచ్‌మెంట్ ఏరియా రాష్ట్రంలో 80 శాతం ఉన్నా తెలంగాణకు 65 శాతం నీటినే కేటాయించారు. గోదావరి జలాల్లో ఏడాదికి 1,950 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలి. --కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతలు చేపడితే తెలంగాణకు చుక్క నీరుండదని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 1,500 క్యూసెక్కుల అనుమతి మాత్రమే ఉందన్న... హెడ్ రెగ్యులేటర్‌ ఏకంగా 80,000 క్యూసెక్కులకు పెంచుతున్నారని ఆరోపించారు. 2019-20లో పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ అవతలికి 179 టీఎంసీలు తరలించారన్నారు. ఇన్ని జరుగుతున్నా కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రేక్షకపాత్ర పోషిస్తోందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ కూడా తెలంగాణకే ఇవ్వాలని కేసీఆర్ కేంద్రమంత్రిని కోరారు.

ఇదీ చదవండి:ఉత్కంఠభరిత మ్యాచ్​లో వార్నర్​సేన విజయం

Last Updated : Oct 3, 2020, 1:03 AM IST

ABOUT THE AUTHOR

...view details