కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందనితెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. కృష్ణా జలాలపై రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. సాగర్ ఉపఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల అమలుపై సమీక్షించేందుకు హాలియాకు విచ్చేసిన సీఎం కేసీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సమీక్షాసమావేశంలో ప్రసంగించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తెరాసను గెలిపించినందుకు ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తనకు కరోనా సోకడం వల్ల నియోజకవర్గానికి రావడం ఆలస్యమైందని వివరించారు.
హాలియాను బాగుచేసి చూపిస్తా..
"నాకు కరోనా సోకడం వల్ల హాలియాకు రావడం ఆలస్యమైంది. సాగర్ ప్రచారం తర్వాత కరోనా బారినపడ్డా. సాగర్ ఉపఎన్నికలో తెరాసను గెలిపించిందుకు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. నాగార్జునసాగర్ సమస్యలను తెరాస నేతలు నా దృష్టికి తెచ్చారు. హాలియా ఏం బాగాలేదు.. బాగుచేసి చూపిస్తా. నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్లో ఉన్నవారికి .. నందికొండ ఇరిగేషన్ భూముల్లో ఉన్నవారికి క్రమబద్ధీకరిస్తాం. నెల రోజుల్లోనే లబ్ధిదారులకు పట్టాలు అందిస్తాం. హాలియా, నందికొండకు రూ.15 కోట్ల చొప్పున కేటాయించాం. హాలియాలో డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం నిర్మిస్తాం. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించాం. నాలుగైదు రోజుల్లో సాగర్ నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తా. సాగర్ నియోజకవర్గంలో పెద్దఎత్తున బంజారాలు ఉన్నారు. వాళ్ల కోసం బంజారా భవనం నిర్మిస్తాం."
- కేసీఆర్, ముఖ్యమంత్రి.
దళితబంధుతో దేశానికే ఆదర్శం..
దళితబంధు కోసం రూ.లక్ష కోట్లయినా ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. దళితబంధుపై అనేక అపోహలు, అనుమానాలు రేకెత్తిస్తున్నారని... పైలెట్ ప్రాజెక్టు తర్వాత వాటన్నింటికీ సమాధానం దొరుకుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయన్న సీఎం... 12 లక్షల కుటుంబాలు దళితబంధు పథకానికి అర్హత ఉన్నాయన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దళితబంధు పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. తానే స్వయంగా పర్యవేక్షించి.. ఆరునూరైనా దళితబంధు అమలు చేసి చూపుతామని ఉద్ఘాటించారు. ఈ పథకం అమలు తర్వాత.. తెలంగాణ ఎస్సీలు దేశానికి ఆదర్శమవుతారని పేర్కొన్నారు. దళితబంధు అమలుచేస్తే తమకు పుట్టగతులు ఉండవని విపక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.