ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: నాగార్జునసాగర్ అభ్యర్థి ఎంపికపై సీఎం సమాలోచనలు ​

By

Published : Mar 24, 2021, 7:17 AM IST

తెలంగాణ నాగార్జునసాగర్ ఉపపోరు అభ్యర్థి ఖరారుపై ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టి సారించారు. నామినేషన్ల దాఖలుకు మరో వారం గడువే ఉండటంతో అభ్యర్థిని ఒకట్రెండు రోజుల్లో ప్రకటించాలని యోచిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు తెలిసింది. సాగర్‌లో తొలిరోజు ఐదు నామపత్రాలు దాఖలయ్యాయి.

cm kcr consultations on Nagarjunasagar candidate selection
నాగార్జునసాగర్ అభ్యర్థి ఎంపికపై సీఎం సమాలోచనలు ​

తెలంగాణ నాగార్జుసాగర్‌ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఎవరన్నది మరో రెండురోజుల్లో తేలనుంది. అన్ని కోణాల్లో ఆలోచించి బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రెండు నెలలుగా నిర్వహించిన సర్వే నివేదికను కేసీఆర్​ పరిశీలించారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత పార్టీ మరోసారి నమూనా సర్వేను చేయించగా... దాని ఫలితం సీఎం వద్దకు చేరింది. ఈ తరుణంలో అభ్యర్థి ఎంపిక సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కసరత్తు ముమ్మరం చేశారు. సాగర్‌ నియోజకవర్గంలో బీసీ నేతనే నిలబెట్టాలని పార్టీ సర్వేలు, పరిశీలకులు సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల అభిప్రాయాలనూ ఇప్పటికే తెలుసుకున్నట్లు సమాచారం. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్ పేరు అభ్యర్థిత్వానికి ప్రముఖంగా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, బాలరాజ్ యాదవ్ పేర్లు జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తేరా చిన్నపరెడ్డి, కోటి రెడ్డిల పేర్లు సైతం పరిశీలించే వీలుంది.

తొలిరోజు ఐదు నామపత్రాలు దాఖలు

సాగర్‌ ఉపఎన్నికకు తొలిరోజు ఐదు నామపత్రాలు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ వెల్లడించారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు యంత్రాంగం తెలిపింది. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన చినధనరాజు, మల్కాజిగిరికి చెందిన రమేశ్, దుబ్బాకకు చెందిన గౌటి మల్లేశ్, కరీంనగర్‌కు చెందిన శ్రీకాంత్ లో పాటు సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్‌గూడెంకు చెందిన నాగరాజు ఉన్నారు. నిరుద్యోగం, అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే కలియుగ పాండవులుగా ఏర్పడి ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి: 'వాజపేయీ బాటలో నడవండి..విశాఖ ఉక్కును కాపాడండి'

ABOUT THE AUTHOR

...view details