ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 26, 2021, 7:18 PM IST

ETV Bharat / city

ఉత్తమ వాలంటీర్లకు ఉగాది నుంచి సత్కారాలు..3 కేటగిరీలుగా అర్హుల ఎంపిక

వైఎస్​ఆర్ ఆసరా, చేయూత, జగనన్న తోడు పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ వీలైనంత త్వరగా సహకారం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో ముందుకు కదలాలని సూచించారు. ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు ఉగాది నుంచి సత్కారం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు అందించిన సేవలను బేరీజు వేసుకుని మూడు కేటగిరీలుగా విభజించి అర్హులను నిర్ణయించి నగదు ప్రోత్సాహకాలు అందించాలని దిశానిర్దేశం చేశారు.

ap cm ys jagan review on schemes govt
ap cm ys jagan review on schemes govt

వైయస్​ఆర్ ఆసరా, చేయూత, జగనన్న తోడు, వాలంటీర్లకు సత్కారం, ఉపాధి హామీ అంశాలపై సీఎం జగన్‌ సమీక్షించారు. ఆసరా, చేయూతల కింద 66,702 రిటైల్‌ దుకాణాలు పెట్టుకునేందుకు ఆప్షన్‌ ఇచ్చినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే 98 శాతం మంది దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారని, ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో ఈ ఉపాధి మార్గాలను కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. రిటైల్‌ దుకాణాలు కాకుండా చిరు వ్యాపారాలు, టెక్స్‌టైల్స్, హాండీక్రాఫ్ట్స్, ఫుడ్‌ ప్రొడక్ట్స్, జ్యుయలరీ, కెమికల్‌ తదితర వ్యాపారాలను ఆప్షన్‌గా పెట్టుకున్న వారు దాదాపు 16.25 లక్షల మంది ఉన్నారని చెప్పారు. వీలైనంత త్వరగా ఆప్షన్ పెట్టుకున్న వారికి తోడుగా నిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు కదలాలని సూచించారు.

పాలవెల్లువపై సమీక్ష

చేయూత, ఆసరా కింద ఆప్షన్లు ఎంచుకున్న వారికి ఉపాధి కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూసేందుకే ఒక ఏజెన్సీని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జగనన్న పాలవెల్లువపై సీఎం సమీక్షించారు. డిసెంబరు 2021 నాటికి మరో 1,06,376 యూనిట్లు అందజేస్తామని అధికారులు తెలిపారు. రెండో విడత ఆసరా, చేయూత అందించేలోగా ఈ ఉపాధి మార్గాలను ముమ్మరంగా చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. గడువు కన్నా ముందుగానే వారికి గొర్రెలు, మేకలు, పాడిపశువులు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న తోడు పథకం ప్రగతిపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. పెండింగులో ఉన్న దరఖాస్తులకు వెంటనే రుణాలు మంజూరయ్యేలా చూడాలని బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా మిగిలిన వారికి కూడా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లు తెలిపారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈ పథకాల అమలు విషయంలో రాష్ట్రం చాలాముందుకు దూసుకుపోతుందని బ్యాంకర్లు వివరించారు.

పనులు వేగంగా చేయాలి..

జగనన్న జీవక్రాంతిపై సీఎం సమీక్షించారు. డిసెంబర్‌ 2021 నాటికి మరో 70,719 మందికి మేకలు, గొర్రెలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతినెలా 5వేల మందికి మేకలు, గొర్రెలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ కార్యక్రమంపై సమీక్షించిన సీఎం.. తగు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన తర్వాత 2020–21లో అత్యధిక పనిదినాలు చేశామన్న ఆధికారులు.. 2328 లక్షల పనిదినాలు చేశామని తెలిపారు. జూన్‌లో అత్యధికంగా 798 లక్షల పనిదినాలు చేశామన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్కుల నిర్మాణాలపైనా సమీక్షించిన సీఎం..ఈ పనులు వేగంగా ముందుకు సాగేలా చూడాలని సీఎం ఆదేశించారు.

వాలంటీర్లకు సత్కారాలు..

వాలంటీర్లను సత్కరించే కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. అర్హతలు ప్రకారం మూడు కేటగిరీలకు వాలంటీర్లను ఎంపిక చేయాలని నిర్ణయించారు. లెవల్‌ 1 లో ఏడాదిపాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు పరిశీలన చేయాలన్నారు. లెవల్‌ 2లో ప్రతి మండలంలో, లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున, లెవల్‌ 3లో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వాలంటీర్లకు సత్కారాలు చేయాలని నిర్ణయించారు. ఏడాదిపైగా సేవలు అందించిన వారికి సేవామిత్రతో పాటు బ్యాడ్జీ, రూ.10 వేలు నగదు పురస్కారం అందించనున్నారు. లెవల్‌–2 వారికి సేవారత్నతో పాటు, స్పెషల్‌ బ్యాడ్జ్, రూ.20వేలు అందిస్తారు. లెవల్‌ –3 వారికి సేవా వజ్రాల పేరిట స్పెషల్‌ బ్యాడ్జ్‌ తో పాటు మెడల్, రూ.30 వేల చొప్పున నగదు పురస్కారాలు అందిస్తారు. పురస్కారాల ఎంపికకు అర్హతలను అధికారులు నిర్దేశించారు.

మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కొవిడ్‌ -19 సర్వే తదితర అంశాలను పురస్కారాల ఎంపికకు ప్రామాణికంగా తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఉగాది నుంచి వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో మూడుచోట్ల కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. పక్షపాతం చూపకుండా, అవినీతి చేయకుండా సేవా దృక్పథాన్ని పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఎం స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఐదు రాష్ట్రాలకు ఈసీ 'ఎన్నికల షెడ్యూల్​'

ABOUT THE AUTHOR

...view details