ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇకపై ఇంటి వద్దకే పింఛన్.. ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ

దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోగా అర్హులకు బియ్యం కార్డులను గ్రామ సచివాలయాల ద్వారా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. కొత్త పింఛన్లనూ అదే రోజు నుంచి ఇస్తామని తెలిపారు.

By

Published : Jan 29, 2020, 6:17 AM IST

cm jagan review on spandana
cm jagan review on spandana

సచివాలయంలో ‘స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 28న జగనన్న విద్యావసతి దీవెనను ప్రారంభిస్తామని, అదే రోజు మొదటి విడత మొత్తాన్ని, జులై-ఆగస్టు నెలల్లో రెండో విడత లబ్ధిని అందిస్తామని సీఎం ప్రకటించారు. '‘పింఛను, బియ్యం కార్డుల సామాజిక తనిఖీని ఫిబ్రవరి 2 నాటికి పూర్తి చేయాలి. 15 నుంచి 21 వరకు కొత్త పింఛను కార్డులు, బియ్యం కార్డులు అందించాలి. ఎన్నికలకు 6 నెలల ముందు పింఛన్లు 39 లక్షలుండగా ఫిబ్రవరి నుంచి 54.64 లక్షల మందికి అందిస్తాం' అని సీఎం జగన్​ తెలిపారు.

ఫిబ్రవరి 15 నాటికి అర్హుల జాబితా..
ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాను ఫిబ్రవరి 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘2006 నుంచి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి. ఇళ్లస్థలాల ఖరారుకు లబ్ధిదారుల్లో మెజారిటీ ప్రజల అంగీకారం తీసుకోవాలి. 25 నాటికి ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్ల అభివృద్ధి పూర్తి కావాలి. మార్చి 1కి భూ సేకరణ, 10 నాటికి వాటిలో ప్లాట్లను అభివృద్ధి చేయాలి. 15 నాటికి లాటరీలు తీసి ప్లాట్లు కేటాయించాలి. అభ్యంతరకర ప్రాంతాల్లో ఉండేవారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారికి ప్లాట్లను ఎక్కడ కేటాయిస్తున్నదీ ముందే చూపించాలి. మొదటి విడత ఇళ్ల నిర్మాణంలో వీరికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాకే వారిని తరలించాలి. గతంలో మనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు. వారికి మంచి జరగాలి’ అని పేర్కొన్నారు.

పంట వేసే సమయానికే మద్దతు ధర
రాష్ట్రంలో 3,300 రైతు భరోసా కేంద్రాలను ఫిబ్రవరి 28న ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ‘ఏప్రిల్‌ మొదటివారంలో మరో 7 వేలు.. మొత్తంగా అదే నెల ఆఖరుకు గ్రామ సచివాలయాల దగ్గర 11,158 కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. రైతు పంట వేసే సమయానికి కనీస గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాం’ అని చెప్పారు.

1 నుంచి మూడో విడత కంటి వెలుగు
‘వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో విడతను ఫిబ్రవరి 1 నుంచి జులై 31 వరకు కొనసాగిస్తాం. వృద్ధులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇప్పటివరకు 66,15,467 మంది చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించాం. 46వేల మందికి శస్త్రచికిత్సలు చేయించాం. లక్షన్నర మందికి కళ్లద్దాల పంపిణీ కొనసాగుతోంది. ఫిబ్రవరి 15 నుంచి ఆరోగ్య కార్డులు జారీ చేస్తాం.వచ్చే నెలలో 4,906 కొత్త ఆరోగ్య ఉపకేంద్రాల ని ర్మాణ పనులు ప్రారంభిస్తాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

మిగతా జిల్లాల్లోనూ ఇంటివద్దకే ఇసుక
అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జనవరి 30 నుంచి ఇంటివద్దకే ఇసుకను అందిస్తామని సీఎం తెలిపారు. ‘ఫిబ్రవరి 7న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో, 14న గుంటూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ప్రారంభిస్తాం. 48-72 గంటల్లో ఇసుకను ఇంటివద్దకు చేరుస్తాం. ఇప్పటివరకు 1,12,082 టన్నులు ఇలా అందించాం’ అని చెప్పారు.

పకడ్బందీగా దిశ చట్టం అమలు
‘దిశ చట్టం అమలులో భాగంగా ఏదైనా ఘటన జరిగితే బాధిత కుటుంబాన్ని ఎస్పీ పరామర్శించి అండగా ఉంటామని చెప్పాలి’ అని సీఎం ఆదేశించారు. ఫిబ్రవరి మొదటి వారానికి రాజమండ్రి, విజయనగరంలో దిశ పోలీసుస్టేషన్లు సిద్ధమవుతాయని, మూడు నెలల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఏర్పాటుచేస్తామని అధికారులు తెలిపారు.

మధ్యాహ్నభోజనం పర్యవేక్షణకు అధికారి
‘మధ్యాహ్న భోజనం నాణ్యతను కలెక్టర్లు తనిఖీ చేయాలి. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీలో ఆర్డీవో స్థాయి అధికారికి పథక పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలి’ అని సీఎం సూచించారు. భోజనం నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడానికి రెండు వారాల్లో యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. పొరుగుసేవల ఉద్యోగుల నియామకాల్లో మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తున్నామని, జీతం పూర్తిగా ఉద్యోగికి చేరేలా మేలు చేస్తున్నామని సీఎం వివరించారు.

ఇదీ చదవండి: మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి కొత్త ప్రాంతాలు

ABOUT THE AUTHOR

...view details