విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు(CM Jagan Review). తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రీప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులు వేసేందుకు చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి జగన్ సమగ్రంగా చర్చించారు. పిల్లల్లో 6 ఏళ్ల వయసులోపే 80 శాతం మేథో వికాసం చెందుతుందన్న సీఎం... నిరుపేద విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలని తన తపన, ఆరాటమన్నారు. ఆ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లు, ఫౌండేషనల్ స్కూళ్లు అని స్పష్టం చేశారు.
కిలోమీటర్ దూరం లోపే ఉండాలి..
అన్ని వసతులతో విద్యార్థులకు మంచి విద్యాభ్యాసం కోసమే మనబడి, నాడు-నేడు చేపట్టామమన్న సీఎం... ఈ కార్యక్రమంలో భాగంగా, స్కూళ్ల రూపురేఖలనే సమూలంగా మార్చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఏర్పాటు చేయాలనుకున్న ఫౌండేషనల్ స్కూళ్లు అన్నీ ఒక కిలోమీటర్ దూరం లోపల ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 3 తరగతి నుంచి 10 లేదా 12వ తరగతి అన్ని హైస్కూళ్లు 3 కిలోమీటర్ల దూరం లోపల ఉండాలని నిర్దేశించారు. వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా ఉండాలని ... ఆ విధంగా స్కూళ్ల మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు.
ఇంకా అత్యుత్తమ విద్యను అందించవచ్చు..
టీచర్లలోని బోధనా సామర్థ్యాని మరింత వినియోగించుకునేలా తగిన హేతుబద్ధీకరణ చేపట్టాలని, తద్వారా పిల్లలకు ఇంకా అత్యుత్తమ విద్యను అందించవచ్చుని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కొత్త ప్రతిపాదనల అమలు వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందన్న దానిపై పూర్తిస్థాయిలో అధికారులు ఆలోచనలు చేయాలన్నారు. తదుపరి సమీక్షలో నివేదించాలని సీఎం ఆదేశించారు. ఒకవేళ వాటిని అమలు చేయాల్సిన పక్షంలో ముందుగా 3, 4, 5 తరగతులను యూపీ స్కూళ్లకు, హైస్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ ఖరారైన తర్వాత ఫౌండేషనల్ స్కూళ్లలో చేపట్టాల్సిన నాడు-నేడు కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని నిర్దేశించారు.
బ్లాక్ బోర్డు నుంచి గ్రీన్ బోర్డ్స్కు..