ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పరిశ్రమలకు జీవితకాల భరోసా: సీఎం జగన్

By

Published : Jun 5, 2020, 7:30 PM IST

Updated : Jun 6, 2020, 2:19 AM IST

రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలకు జీవితకాలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే అండగా ఉండేలా నూతన చట్టాన్ని రూపొందించాలని పరిశ్రమల శాఖ అధికారులకు సీఎం జగన్ సూచించారు. రాష్ట్రంలో ఇండస్ట్రీయల్‌ పార్కు, క్లస్టర్ల ఏర్పాటుకు పెద్ద పీట వేయాలని ఆదేశించారు. పెట్టుబడుల్లో డీ రిస్కింగ్‌ ద్వారా పరిశ్రమలకు పెద్ద ఊతం ఇస్తామన్నారు. అనుకున్న సమయానికి పరిశ్రమ ప్రారంభం అయ్యేలా చూడగలగడమే...పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహమని సీఎం అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక విధానం నిజాయితీగా ఉండాలని... ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా ఉండాలన్నారు. మోసం చేసే మాటలు వద్దన్నారు.

cm-jagan-review-on-industrial-policy
సీఎం జగన్

స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డుపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్​మోహన్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, బొత్స సత్యన్నారాయణ, గుమ్మనూరి జయరాములు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా అధికారులు హాజరయ్యారు. కొత్త పారిశ్రామిక విధానం, ఇండస్ట్రీకి అనుమతుల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులతో సీఎం చర్చించారు. పారిశ్రామిక విధానానికి సంబంధించి మార్గనిర్దేశం చేశారు.

వందలాది కోట్ల రూపాయలను ఖర్చుచేసి పరిశ్రమను పెడుతున్నప్పుడు, అనుకున్న సమయానికి అది ప్రారంభమయ్యేలా చూడటం ద్వారా కార్యకలాపాలకు ఊతం ఇవ్వడం ప్రభుత్వం చేదోడుగా నిలవాలన్న సీఎం సూచించారు. స్థిరమైన పెట్టుబడులు రావాలన్నా, పదికాలాలపాటు పరిశ్రమలు చక్కగా నడవాలన్నా...,అందుకు అనుకూలంగా పారదర్శక విధానాలు ఉండాలని జగన్ పేర్కొన్నారు. పరిశ్రమకోసం పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు, ఎలాంటి విధానం ఉండాలన్నదానిపై సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు.

1. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో కాలుష్య నివారణా పద్దతుల్లో నిపుణులైన, ప్రఖ్యాత వ్యక్తులతో ఒక కమిటీని నియమించాలి. కనీసంగా ఇందులో నలుగురు సభ్యులు ఉండాలి. అలాగే ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలతో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును టై అప్‌ చేయాలి.

2. పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఎవరైనా ముందుకు వస్తే... ముందుగా ఆ ప్రతిపాదన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో ఉన్న నిపుణులకు పంపాలి. ఆ కమిటీ ద్వారా అప్పటికే టైఅప్‌ అయిన సంస్థలు ఆ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలి. నివేదిక రాగానే పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తుంది.

3. ఈ కమిటీ సిఫార్సులు సానుకూలంగా వస్తే.. స్టేట్‌ ఇండస్ట్రీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ ముందుకు ఆ ప్రతిపాదన వెళ్తుంది. వారు సంబంధిత పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం పాలసీని వివరిస్తారు, అవగాహన కల్పిస్తారు. పెట్టుబడుల్లో వారి విశ్వసనీయత, సమర్థతలను ఎస్‌ఐసీసీ పరిశీలించి ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే, తర్వాత ఆ ప్రతిపాదన ఎస్‌ఐపీబీ ముందుకు వస్తుంది.

4. ఎస్‌ఐపీబీ ఆ ప్రతిపాదనపై ప్రజంటేషన్‌ ఇచ్చాక.. ప్రభుత్వం క్లియరెన్స్‌ ఇస్తుంది.

5. ఆ తర్వాత పరిశ్రమ ఏర్పాటు చేసేవారికి చేయూతగా సింగిల్‌ విండో విధానం నిలుస్తుంది.

ప్రభుత్వ నూతన విధానం కారణంగా పెట్టుబడులు పెట్టేవారికి రిస్క్‌ తగ్గుతుందని, అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభం అయ్యేందుకు వారికి తగిన తోడ్పాటు లభిస్తుందని సీఎం చెప్పారు. ఇదే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహంగా నిలుస్తుందని సీఎం అన్నారు. పరిశ్రమలకు, ప్రజలకు మేలుజరిగేలా ఈ విధానం నిలుస్తుందని...భవిష్యత్తు తరాలు కూడా మనకు ముఖ్యమని, పరిశ్రమలు రావడం, తద్వారా ఉద్యోగాల కల్పన ముఖ్యమైన అంశమని, అదే సమయంలో ప్రజలకు, పర్యావరణానికి హాని జరకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

నిజాయితీగా పారిశ్రామిక విధానం

త్వరలో తీసుకురాన్న ఇండస్ట్రీయల్‌ పాలసీ విధివిధానాలపైన కూడా ఎస్‌ఐపీబీ సమావేశంలో చర్చ జరిగింది. పాలసీ రూపకల్పనలో పరిగణలోకి తీసుకోదగ్గ అంశాలను అధికారులకు సీఎం సూచించారు.

  • ఇండస్ట్రీ పాలసీ నిజాయితీగా ఉండటంతో పాటు మోసం చేయకూడదని,పరిశ్రమలకు మాట ఇస్తే అది కచ్చితంగా నెరవేర్చాలని కోరారు.
  • పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్‌ లాంటి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
  • నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందిస్తామని..., ప్రభుత్వం సానుకూలంగా, వారిపట్ల ప్రోయాక్టివ్‌గా ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
  • పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం నిజాయితీగా ఏం చేయగలదో అదే చెప్పాలనే అంశాల ప్రాతిపదికగా పారిశ్రామిక విధానం తయారు చేయలని అధికారులకు సూచించారు. ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అనంతరం ప్రతిపాదనల్నీ వాస్తవ రూపంలోకి రావాలన్నారు.

కనికట్టు మాటల వద్దు

పరిశ్రమల విషయంలో కనికట్టు మాటలు వద్దని, గత ప్రభుత్వం ఇలాంటి మాటలే చెప్పి...4 వేలకోట్ల రూపాయల ఇన్సెంటివ్‌లను బకాయిలగా పెట్టిందని సీఎం గుర్తు చేశారు. ఆ బకాయిలను తీర్చడానికి ఈ ప్రభుత్వం అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్న సీఎం...ఎంఎస్‌ఎంఈలకు ఇప్పటికే ఒకవిడతలో 450 కోట్ల రూపాయలు చెల్లించామని, మిగిలిన డబ్బును చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు చెల్లించిన తర్వాత రంగాలవారీగా, దశలవారీగా బకాయిలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చట్టం తెచ్చామన్న సీఎం జగన్....దానికోసం యువతకు అవసరమైన నైపుణ్యాన్ని ప్రభుత్వమే కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందడంతో పాటు, స్థానికంగానే వారికి నైపుణ్యమున్న మానవనరులు లభిస్తాయన్నారు.

ఇవీ చదవండి:'ఈ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి'

Last Updated : Jun 6, 2020, 2:19 AM IST

ABOUT THE AUTHOR

...view details