తెలంగాణ నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. శ్రీశైలం నుంచి కూడా 4 లక్షల క్యూసెక్కులు విడుదల అవుతున్నందున.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితులపై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ‘వరదల కారణంగా విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలి. సహాయ శిబిరాల్లో ఉన్న వారితో మానవతా దృక్పథంతో వ్యవహరించండి. వారికి కనీసం రూ.500 చొప్పున ఇవ్వండి. వారి ఇళ్లలో పరిస్థితిని ఆరా తీసి ఆదుకోండి. భారీ వర్షాలతో వేర్వేరు జిల్లాల్లో చనిపోయిన పది మంది బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం అందించండి...’ అని ఆదేశించారు. ‘వారం రోజుల్లో పంట నష్టం అంచనాలు తయారు చేసి పంపాలి.. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలి. చెరువులు, కాల్వల గండ్లు పూడ్చాలి. దెబ్బతిన్న రహదారులకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలి. నాలుగైదు నెలల్లో శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి...’ అని అధికారులకు స్పష్టం చేశారు.
చెరువులు నింపడంపై కలెక్టర్లు దృష్టి సారించాలి