ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 29, 2020, 7:36 AM IST

ETV Bharat / city

ప్రతి పదిమందికీ ఒక వైద్యుడు

పొరుగురాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వాసులు, రాష్ట్ర సరిహద్దుల వరకు వచ్చినవారి బాగోగులు చూసేందుకు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, అధికారులతో సమన్వయం చేసేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సతీష్‌చంద్ర, పీయూష్‌కుమార్‌లను ముఖ్యమంత్రి జగన్‌ నియమించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి.. పర్యవేక్షణలో ఉన్న ప్రతి పదిమందికీ ఒక వైద్యుడిని కేటాయించాలని, వీరిపై పల్మనాలజిస్టుల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

cm jagan review on corona virus
cm jagan review on corona virus

ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడితేనే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్​ తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌-19 (కరోనా) వ్యాప్తి నిరోధానికి చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలపై ఆయన శనివారం తాడేపల్లిలోని కాం్యపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజలు నిత్యావసరాలు తెచ్చుకోవడానికి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇస్తున్న సమయాన్ని తగ్గించాలని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. జనాభాకు తగ్గట్టుగా రైతుబజార్లు, నిత్యావసర దుకాణాలు అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించాలని, అవన్నీ అందుబాటులోకి వచ్చాకే సమయాన్ని తగ్గించే ఆలోచన చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ తీరును సీఎస్‌ నీలం సాహ్నీ ముఖ్యమంత్రికి వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారి బాధ్యతను సతీష్‌చంద్రకు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చిక్కుకున్నవారి బాధ్యతను పీయూష్‌కుమార్‌కి అప్పగిస్తూ ఆమె ఉత్తర్వులు జారీచేశారు. సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి..

ఐఏఎస్‌ అధికారులకు బాధ్యతలు

ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.. ఎక్కడివారు అక్కడే ఉండాలి. వారి బాగోగులు చూసేందుకు ఆయా రాష్ట్రాల అధికారులు, సరిహద్దు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడేందుకు ఒక ఐఏఎస్‌ అధికారికి బాధ్యత అప్పగించాలి. సరిహద్దుల్లో శిబిరాల ఏర్పాటు, వాటిలో ఉన్నవారికి క్వారంటైన్‌, భోజన, వసతి సదుపాయాల కల్పన బాధ్యతను మరో ఐఏఎస్‌కు అప్పగించాలి. పొరుగురాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వలసకూలీలు, కార్మికులకు సమస్య లేకుండా, అక్కడే అన్ని వసతులూ కల్పించేలా ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలి.

వైద్యుల సేవల వినియోగం

వాలంటీర్లతో నిర్వహించిన రెండో సర్వే ఆధారంగా తీసుకున్న చర్యలపై సీఎం ఆరా తీసి పలు సూచనలిచ్చారు. జిల్లాల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చే వైద్యులను గుర్తించి, వారి సేవలు వినియోగించుకోవాలని, అనారోగ్యం ఉన్నట్లు సర్వేలో గుర్తించినవారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లి, చికిత్స చేయించాలని చెప్పారు. వీలైనంత ఎక్కువ సంఖ్యలో వైద్యులను, వైద్యసిబ్బందిని అందుబాటులోకి తేవడంపై సమావేశంలో చర్చ జరిగింది. హౌస్‌సర్జన్ల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. వైద్య ప్రక్రియలపై అవగాహనకు డాక్టర్లు, స్పెషలిస్టుల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించాలని, ప్రతి 50 ఇళ్లను వాలంటీర్లు ఎప్పటికప్పుడు సందర్శించి, వివరాలు నమోదుచేసే విధానం కొనసాగించాలని తెలిపారు.

నిత్యావసరాల వాహనాల్ని అడ్డుకోవద్దు

నిత్యావసర వస్తువుల వాహనాలను నిలిపేస్తున్నారన్న సమాచారం వస్తోందని, దానిపై దృష్టి పెట్టాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, ఆక్వారంగాల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తూ పొలంపనులు చేసుకునేవారికి అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనా అలజడి: రాష్ట్రంలో 19కి చేరిన పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details