ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇచ్చిపుచ్చుకుందాం...తెలుగు రాష్ట్రాల సీఎంల నిర్ణయం

By

Published : Jan 14, 2020, 4:09 AM IST

గోదావరి జలాలు కృష్ణాకు తరలించడంపై తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ నిర్ణయానికి వచ్చారు. విధివిధానాలపై తదుపరి భేటీలో పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలు, సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని నిర్ణయించిన సీఎంలు..ఈ మేరకు త్వరలోనే సమావేశం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.

cm jagan cm kcr meet at hyderabad
cm jagan cm kcr meet at hyderabad


సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్​లోని ప్రగతి భవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సుధీర్ఘంగా సాగింది. వివిధ అంశాలపై చర్చించిన ఇరువురు సీఎంలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించడంపై ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. కృష్ణాలో ఏటా నీటి లభ్యత తగ్గిపోతుండటం వల్ల.... పంటలకు సాగునీరు అందక ఆయకట్టులో ఉన్న రాయలసీమ, మహబూబ్నగర్, నల్గొండ జిల్లా రైతులు నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో పుష్కలంగా నీటిలభ్యత ఉన్న....గోదావరి జలాలను కృష్ణాకు తరలించి అవసరమైనప్పుడు ఆయకట్టు రైతులకు ఇవ్వడం వల్ల ఆ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు కచ్చితంగా నీరందుతుందని పేర్కొన్నారు. రెండురాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా గోదావరి- కృష్ణా అనుసంధానానికి నిర్మాణాత్మక ప్రణాళిక తయారీకి ఉభయరాష్ట్రాల ఇంజినీర్లు భేటీ కావాలని నిర్ణయించారు.
విభజన చట్టంలోని సమస్యలపై చర్చ
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలు సహా ఇతర సమస్యలపైనా ముఖ్యమంత్రుల భేటీలో చర్చ జరిగింది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోవాలని సీఎంలు అభిప్రాయపడ్డారు. పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే పరిష్కారం పెద్ద కష్టం కాదన్న ముఖ్యమంత్రులు....సమావేశం నుంచే ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడారు. విభజన సమస్యలు పరిష్కరించుకునే దిశలో..... త్వరలోనే భేటీ కావాలని ఆదేశించారు. పోలీస్‌ అధికారుల పదోన్నతులపై సమావేశంలో చర్చజరిగింది. తదుపరి కార్యాచరణలో భాగంగా తెలంగాణ సీఎస్ నేతృత్వంలోని అధికారుల బృందం రాష్ట్రానికి రానుంది. ఆ తర్వాత రాష్ట్ర సీఎస్ నేతృత్వంలోని......అధికారుల బృందం తెలంగాణకు వెళ్లనుంది. ఇరురాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం, పరస్పర సహకారం కోసం తరచూ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. ప్రజలకు ప్రయోజనం కలిగేలా అన్నిఅంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు.
రాజధాని అంశంపై చర్చ!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అమరావతి స్థానంలో మూడు రాజధానులను ఎందుకు ప్రతిపాదిస్తున్నది, తన ఆలోచనలను కేసీఆర్‌తో..... జగన్ పంచుకున్నట్లు సమాచారం. అలాగే ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలు, విద్యుత్‌ ఉద్యోగుల విభజన, తెలంగాణ నుంచి రావాల్సిన కరెంట్‌ బకాయిలు, ఏపీ పౌరసరఫరాల శాఖకు తెలంగాణ చెల్లించాల్సిన క్యాష్‌ క్రెడిట్‌ తదితర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. వాటితోపాటు జాతీయ, స్థానిక రాజకీయాలు ఇతర అంశాలపైనా . ముఖ్యమంత్రుల భేటీలో చర్చ జరిగింది. ముందుగా అనుకున్న ప్రకారం కేవలం రెండు గంటల పాటు మాత్రమే సమావేశం జరగాల్సి ఉన్నా సుదీర్ఘంగా ఆరు గంటల పాటు సాగింది.

ABOUT THE AUTHOR

...view details