వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తోన్న ఆహారం, నాణ్యతపై ముఖ్యమంత్రి చర్చించారు. మరింత రుచికరమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ డైట్ ఛార్జీలను పెంచాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీ పేషెంట్ల తరహాలోనే రోజుకు రూ.100కు పెంచాలని ఆదేశించారు. నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ ఇవ్వాలని సీఎం సూచించారు.
జూనియర్ డాక్టర్ల స్టై ఫండ్ పెంపుపైనా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీలోకి కొత్త చికిత్సల చేరికలపై ప్రగతిపై సీఎం ఆరా తీశారు. వైయస్సార్ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సల చేరిక దాదాపు ఖరారు చేసినట్లు అధికారులు... ముఖ్యమంత్రికి తెలిపారు. కొన్ని సంప్రదింపులు మిగిలి ఉన్న దృష్ట్యా కార్యక్రమం ప్రారంభానికి సమయం కావాలని కోరారు. అక్టోబరు 5కు బదులు... అక్టోబరు 15న ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని ప్రొసీజర్ల చేరిక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. దీనితో పాటు ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాలని నిశ్చయించారు.
ప్రస్తుతం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు ఉండగా.. కొత్త వాటి చేరికతో 3,254కు చికిత్సల సంఖ్య చేరనున్నట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదికి దాదాపు మూడు రెట్లు పెరిగిందని సీఎం తెలిపారు. పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్య శ్రీకి సుమారుగా 2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు 300 కోట్ల108,104ల కోసం సుమారు మరో రూ.400 కోట్లు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా దాదాపు 3వేల 200 కోట్లు వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104ల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి మరో 432 కొత్త 104 వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 676 వాహనాలు సేవలందిస్తుండగా...కొత్తవి చేరితే వాటి సంఖ్య 1108కి చేరనుంది. అలాగే ఇప్పటికే సేవలందిస్తున్న 748, 108 వాహనాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.